పుట:GanapathiMuniCharitraSamgraham.djvu/92

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

9-3-1927 తేది సంచికయందు గోల్కొండ పత్రికలో ప్రకటింపబడిన ప్రశ్నోత్తరములలో నాయన యభిప్రాయములు కొన్ని యిట్లున్నవి.

ప్రశ్న: హిందువులకు సామాన్యధర్మములెవ్వి?

ఉత్త: వేదముల నమ్ముట, వానిలో నందరికిని సమానాధికార మిచ్చుట. ఈ రెండు సమకూడిననే కాని అందరికి విశ్వాసము కలుగదు. క్రైస్తవుడు బైబిలు నెట్లో హిందువు సంహితము (సహితము) వేదము నట్లు భావించవలయును.

ప్రశ్న: కులభేదము లుండవలయునా?

ఉత్త: అందరు బ్రాహ్మణులే కావలయును. అట్లగువరకు చాతుర్వర్ణములలో అంతశ్శాఖాభేదములు పూర్తిగా పోవలయును. ఇందు హెచ్చుతగ్గులు పాటింపకూడదు. ఆచారముల యొక్క సామ్యత యుండిననే బ్రాహ్మణత్వము కలుగును.

ప్రశ్న: స్మృతులిప్పుడు వ్రాయవచ్చునా?

ఉత్త: వ్రాయవచ్చును.

ప్రశ్న: వాని నాచరణములో నుంచు టెట్లు?

ఉత్త: ఒక పరిషత్తు ఏర్పడవలయును. అదియే శాసింపవలయును.

ప్రశ్న: బ్రాహ్మణ బ్రాహ్మణేతర సమస్యను పరిష్కరించుటెట్లు?

ఉత్త: అందరికిని వేదాధికార మిచ్చుటచేతనే.