ధారావాహిక
నంద్యాల నారాయణరెడ్డి 9360514800
సొతంత్రకాల సదువులు 9
ఎల్లప్పు చౌదరి పెట్టంగడి :
వేసగి బిడువులు ముగించుకొని వచ్చి పదో తరగతిలో చేరితిమి. ఆటల పాటల నడుమన చదువు సాగతా ఉంది. తరగతి పొత్తాలు కాకుండా కొత్త కొత్త ఫొత్తాలు పరిచయం అవతా ఉండాయి మాకు. వాటినీ మా కళ్ల ముందుకు తెచ్చి పెట్టింది ఎల్లప్పు చౌదరిగారి పెట్టంగడి (పెట్టె అంగడి).
హోసూరులో దినపత్రికలూ మాసపత్రికలూ దొరికే అంగడి అది. హోసూరు ఆంధ్రలో చేరకపోయినా, మదరాసు రాష్ట్రంలోనే మిగిలిపోయినా మా ఊర్లో అమ్మే పత్రికలన్నీ తెలుగువే. మా తావున ఎక్కువగా చదివేది ఆంధ్రపభ్ర దినపత్రిక. పేటలో అయితే అంతో ఇంతో చదువుకొన్న ఎవరి చేతిలో చూపినా ఆంధ్రప్రభ కనబడుతుంటుంది. ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ వంటి వారపత్రికలే కాక డిటెక్టివ్ నవలలూ ఎమెస్మోవాళ్ల పొట్టి పొత్తాలూంటే వేనవేలు అమ్ముడవుతుంటాయిక్కడ. ఏ తెరువులో అయినా ఏ ఇంట్లో అయినా తెలుగు పత్రికలు పట్టని చెయ్యే ఉండదు. మైనరుబాబుల చేతుల్లో అయితే పసుపూ ఎరుపూ అంచుల డిటెక్టివ్ నవల ఉండే తీరుతుంది.
పొద్దునా మాపునా ఆ పెట్టంగడి దగ్గ జనం సందడే సందడి. దినపత్రికలు చేత పట్టుకొని దేశ రాజకీయాలు మాట్లాడేవాళ్లు ఒకపక్క వారపత్రికల్లోని సాహిత్యాన్నీ సినిమా వార్తలనూ తిరగేసేవాళ్లు ఒకపక్క రామాయణం, భారతం, భాగవతం కైవారం తాత తత్వాలు వంటి పొత్తాలను కొంటూ వేదాంత చర్చల్లో మునిగేవాళ్లు ఒకపక్క రాజమండ్రివారి “నవ్వులు పువ్వులు” కొవ్వూరువారి 'పకపకలు” వంటి హాస్య పత్రికలను చూస్తూ పకపక నవ్వేవాళ్లు ఒకపక్క చందమామ బాలమిత్రవంటి బాల పత్రికల కోసం గుమిగూడిన చిన్నోళ్లం ఒకపక్క..ఇట్ల తెలుగుతనమంతా ఉడ్డపోసినట్లుంటుంది ఎల్లప్ప చౌవరిగారి పెట్టంగడి.
ఎల్లప్పచౌదరి పుణ్యం వలనే మా పేటలో తెలుగు పత్రికల్ని చదివే వాడిక పెరిగిందని పెద్దోళ్లు అంటుంటారు. ఈయనది హోసూరుకు 20 కి.మీ దూరంలోని తిప్పేపల్లి అనే చిన్న పల్లెటూరు. అక్కడనింకా పేటకు వచ్చేసి, అపురూపమైన మహాడీని కట్టుకొని ఉంటున్నాడు. ఆరడుగులకు మించిన ఆజానుబాహుడు ఆయన. గోచిపోసి కట్టిన పంచె, పైన జుబ్బా, నడుముకు డవాలు, జుబ్బాపైన అరచేతుల కోటు, వెలుపైన మొకము, విశాలమైన నుదురుమీద విబూది పట్టెలు, కోటేరేసినట్లు ముక్కు..పొద్దునా మాపునా ఆయన దోవ పొడుగునా అందరినీ మాట్లాడిస్తా నవ్వుతా నడచిపోతుంటే తెరాటల్లోని గుమ్మడి వెంకటేశ్వర్రావు మా పేటకు వచ్చేసి తిరుగుతున్నట్లు అనిపిస్తుంటుంది. ఆబాలగోపాలానికీ తెలుగు పత్రికల రుచిని చూపించిన మహన్నబావుడు మా ఎల్లప్ప చౌదరి.
తలలో నాలుక అనంతయ్యవారు :
కేవలం సంపాదన కోసమే కాకుండా తెలుగుసేవ కోసం కూడా అంగడిని నడిపే ఎల్లప్ప చౌదరి మాదిరిగానే ఇంకొకాయన కూడా ఉండారు మా పేటలో. ఆయన పేరు అనంతయ్యవారు. ఎల్లప్ప చౌదరి పెట్టంగదికి పక్కనే ఈయనది పూటకూళ్ల అంగడి. ఎవరైనా అంగటికి పోయి బెంచీమీద కూర్చుంటానేే, వాళ్ల ఎదురుగా ఉండే బల్లమీద వంగి రెండు మోచేతులనూ ఆనించి, కళ్లలో కళ్లుపెట్టి చూస్తా “ఏం తింటావు కడుపుకి?” అని గద్దించినట్లు అడుగుతాడు అనంతయ్యవారు. కొత్తవాళ్లయితే తుల్లిపడి పైకిలేచేస్తారు. ఏలనంటే అది తిట్టుకదా! అపుడు అయ్యవారు చిరునవ్వు నవ్వుతూ “ఏలప్పా లేచేస్తివి, ఇడ్లీనా దోసెనా ఏం తింటావు అని అడిగితిని అంటే, లేచినవాళ్లు కూడా నిట్టూర్చి నవ్వుతూ కూర్చునేవాళ్లు. తినినంక రవంతసేపు అక్కడే కూర్చునేవాళ్లకు తన అంగట్లో ఎత్తిపెట్టిండే పత్రికలనో నవలలనో ఇచ్చేవాడు చదువు కొమ్మని. కొన్ని పొత్తాలను అమ్ముతుంటాడు కూడా.
తెరాట కొటాయిల్లో సాదామిని, అమరగీతం, సారంగధర, ఛింతామణి, పెళ్లినాటి ప్రమాణాలు వంటి తెరాటలు నడుస్తుంటాయి. ఇదే కాదు ఇంకా ఎన్నెన్నో తెరాటలు. వీటని చూసేకి పల్లెలనింకా ఎద్దుల బండ్లు కట్టుకొని జనం వస్తుంటారు. మొదటి ఆట చూసినాక వెంటనే రెండో ఆటకు పోయి, దానిని కూడా చూసినంకనే, ఏ నడిరేయిలోనో ఊర్లకు బయలుదేరుతారు.
అనంతయ్యవారు సెనగల్నో పెసల్నో అలసందల్నో సుండలు (గుగ్గిళ్లు) చేసి, కొటాయిల దగ్గర దినానికి రెండు మూడు మణుగులు (20 లేదా 30 కిలోలు) అమ్మేస్తుంటాడు. తెరాటల్లో నడుమ నడుమ అరగంటకొకసారి 'రీళ్లుు ' అని విరామం ఉంటుంది. అప్పుడు ఈ సుండలు కొనుక్కొనేవాళ్లు. ఆటలో ఐదారు రీళ్లన్నా ఉంటాయి. అనంతయ్య వారు సుండల బేరంతోపాటు ఇంకొక మేలును కూడా చేస్తుంటాడు. కొటాయిల బయళ్లలో ఉండే బండ్లకూ ఎద్దులకూ కావలికాస్తా ఉంటాడు. అయ్యవారు ఎవరికీ బెదరడు, రౌడీలకు కూడా ఆయనంటే అడలు. ఒక అణా ఇస్తే రెండు పిదికిళ్ల సుండలు ఇస్తాడు. అయ్యవారి చెయ్యి పెద్దది. ఆ సుండలుతోనే ఆకలి తీరిపోతుంది. కాసులిచ్చి కొనుక్కోలేనీ చిన్నోళ్లు ఎవరైనా ఆయన