- యాత్రాసాహిత్యం
“ఆమె లేఖలు”
మూల రచన : జూలియా చార్లోటి
అనువాదం : కీ.శే. పెన్నేపల్లి గోపాలకృష్ణ
డా.కాళిదాసు పురుషోత్తం 9000642079
(గత సంచిక తరువాయి...)
నాలుగోలేఖ : నాలుగోజాబు అక్టోబరు 6వ తేది. ట్రిస్టన్ డి అకున్హా అనే ప్రదేశం చేరారు. అక్కడికి చాలా కొద్ది ఓడలు మాత్రమే వెడతాయట. అది ఒకనాటి అగ్ని పర్వతం. సముద్ర మట్టానికి 8 వేల అడుగుల ఎత్తున ఒక రాతి ప్రదేశం. బోనపార్టీ హయాంలో లార్డ్ కానల్రీ అక్కడొక స్థావరాన్ని ఏర్పరచి, కొంతమంది సైనికుల్ని నియమించాడట. వాళ్లలో కొన్ని కుటుంబాలు ఇప్పటికీ అక్కడ స్థిర నివాసం ఏర్చరచుకొనీ వున్నారని ఆమె రాస్తుంది. అక్కడి గవర్నరును ఒకప్పుడు కార్పొరల్ గ్లాస్ అనేవాళ్లు. అతను, అయిదుగురు అంగరక్షకులు, వాళ్లభార్యలు, 32 మంది సంతానంతో ఆ ద్వీపంలో ఇరవై ఏళ్లుగా వుంటున్నారు. ఓడ నేరుగా ఆ ప్రాంతానికి వెళ్లలేకపోయేసరికి, 'గ్లాస్నే' నలుగురు మనుషుల్ని వెంటపెట్టుకొనీ ఓడ వద్దకు వచ్చాడు. వాళ్లకు కెప్టెన్ మంచి భొజనం పెట్టి, కానుకలిచ్చి గౌరవించాడు. వాళ్లు మేకులు కావాలని అడిగారు -గాలికి ఎగిరిపోకుండా కొట్టుకోడానికట. అందరూ సంతోషంగా జీవితాలు గడుపుతూంటారు. చట్టాలు, నిబంధనలు లేవు. అందరూ ఏ. పొరపొచ్చాలు లేకుండా కలిసి మెలసి బతుకుతారు. ఒకరి వ్యవహారంలో మరొకరు జోక్యం చేసుకోరు. “గ్లాస్ వాళ్లకు పెద్దేకానీ యజమాని కాదు. వాళ్ల పిల్లలకు చదువు చెప్తాడు. మత గురువు కూడా అతనే!
తర్వాత మజిలీ కేప్ ఆఫ్ గుడ్ హోప్. వారం రోజులు మజిలీ. రోజూ గుర్రాలు అద్దెకు తీసుకొని ఊరంతా తిరిగేవాళ్లు. కేప్టౌన్ మంచి పట్టణం. చక్కని వీధులు. ప్రతి వీధీ చెట్టు చేమలతో కళకళలాడుతూ వుంటుంది. అన్నీ రెండు అంతస్టుల తెల్లని మేడలు. ఊరి నిండుకూ ఇంగ్లీషు, డచ్, మలయా, పార్సీ, హస్టైన్ టాట్స్ అనే జాతి వాళ్లతోపాటు దోమలు, నల్లులు కూడా సమృద్ధిగా వున్నాయని, అందరికంటే ముందుగా నల్లులే అక్కడ స్థిర నివానం ఏర్పరచు కొన్నట్లుంటుందనీ ఆమె చమత్మరిస్తుంది. అక్కడ తాను దిగిన ఇంగ్లీషు లాడ్జింగ్కు తన సోదరుడు ఫ్రాంక్ అయితే, హోటల్ డేడ్స్దే అని పేరు పెట్టి వుండేవాడని అంటోంది. ప్రయాణీకులు రెండు జట్లుగా విడిపోయి, ఊరు చూడ్డానికి బయల్దేరారు. నిన్న కొండ చిలువను చూడ్డానికి వెళ్లాం. 33 అడుగుల పొడవు, పచ్చమట్టి రంగుల్లో ఆవలి పక్క వెండి పొలుసులతో మహా భయంకరంగా వుంది. నేనింత వరకు అట్లాంటి భయంకరమైన పాముని చూడలేదని రాస్తుంది. సముద్ర తీరం నుంచి దాదావు 15 మైళ్లు వెళ్లి కేవ్టౌన్ చూసి వచ్చారు. కేప్టౌన్ మెదెయిరా అంతటి అందమైన ప్రదేశం కాకపోయినా, ఒకటి రెండు అద్భుత దృశ్యాలు ఆకట్టుకొంటాయి. పెద్దపెద్దరాళ్లు, పచ్చిక మైదానాలు, పూలతో నిండిన బయళ్లు - కనుల పండువగా వుంటాయి. ఇంగ్లీషువాళ్లు కట్టించిన చర్చి ఆమెకు చాలా బాగుంటుంది. దానికి అనుబంధంగా సన్డే స్కూలు వుంది. ఒక మ్యూజియం కూడా వుంది. ఈ ఊళ్లో జీవనం ఎలా వుంటుందని నాన్నగారు అడిగితే, ఇక్కడ వస్తువుల ధరలు మూడు రకాలుగా ఉంటాయని, డచ్వారికి చౌక, ఇంగ్లీషువాళ్లకి ప్రియం, మాలాంటి యాత్రికులకు ప్రియాతి ప్రియం అని చెప్పమంటుంది.
కేప్ వదిలిన తర్వాత, ప్రయాణమంతా ప్రయాసగా సాగిందని, ఎదురుగాలులు, ఈదురు గాలుల్లో ఓడ ఊగిస లాడుతూంటే, తాము పడుతూ లేస్తూ ప్రయాణం సాగించామనీ ఆమె మద్రాసు చేరిన తర్వాత, అక్టోబరు 13వ తేదీ రాసిన ఐదో జాబులో పేర్కొంది. వాతావరణం ఎట్లా వుందని కెప్టెన్ను అడిగితే చాలా భయంకరంగా వుందని, ఎప్పుడైనా తుపాను రావచ్చుననీ మోచ్చరించేవాడు. రోజంతా భయంభయంగా, విసుగ్గా వుండేది. ఎవరికీ తోచేదికాదు. ఆ విసుగులో ఒకరితో ఒకరు ఉత్త పుణ్యానికే తగువులాడుకొనేవారు. ఐతే మొత్తం మీద ప్రయాణీకులు స్నేహంగా, సౌమ్యంగానే గడిపి, క్షేమంగా మద్రాసు తీరం చేరుకున్నారు.
తాము మద్రాసు తీరం చేరుకున్న రోజు సముద్రం ప్రశాంతంగా వుందని, అలలు అసలు లేవని ఆమె రాస్తుంది. ప్రయాణీకులందరూ ఓడ నుంచి 'మసూలా పడవల్లోకి మారి తీరం చేరుకుంటారు. ఆ పడవల్ని నడిపే సరంగులు ఒంటిమీద చిన్నగుడ్డ పేలికలతో నల్లగా వుంటారనీ, వాళ్లు తమాషాగా ఈలవేస్తూ పడవలు నడుపుతారని, ఒక్కో పడవకు పన్నెండు మంది సరంగులుంటారని ఆమె చెప్తుంది “మద్రాసు రోడ్సు దృశ్యం అద్భుతంగా వుంటుంది. సముద్రం రకరకాల ఓడలతో, నావికులతో కళకళలాడుతూంటుంది. అయితే అవేవీ తెప్పలకు, వాటిని నడిపే చిత్రమైన మనుషులకూ సరిపోలవు. మూడు కొయ్య మొద్దుల్ని ముడివేసి తెప్పగ తయారు చేసి సముద్రం మీదికి వెళ్తారు. తిరిగి రాగానే మొద్దుల్ని విడదీసి ఎండబెడతారు. ఒక్కొక్క తెప్పను ఒకరు, ఇద్దరు లేక ముగ్గురు నడుపుతారు. వాళ్లు తెప్ప మీద గొంతు కూచుని, నేర్పుగా తెడ్డువేస్తారు. ఈ తెప్పలు సముద్రం మీదికి వెళ్లే దృశ్యం ఆసక్తికరంగా వుంటుంది. భయంకరమైన అలల్లో సహితం అవి వెళ్తాయి. ఒక్కోసారి అలలపై అలవోకగా నాట్యం చేస్తూ, మరి ఒక్కోసారి నీటికింద దోబూచులాడుతూ, ఒక్కోసారి తెప్ప, మనిషి అలల్లో కొట్టుకొనిపోతూ, తెప్ప ఒకవైపు, మనిషి మరోవైపు తేలిపోతూ, మళ్లీ ఏదో మంత్రం వేసినట్లు రెండూ కలసిపోతూ...” ఇలా వర్ణిస్తుంది మద్రాసు సముద్ర తీరదృశ్యాన్ని ఐదవ జాబులో.
నాలుగు నెలలు ఒక సాహస యాత్రగా సాగిన సాగర యాత్ర ముగిసి ఆమె క్షేమంగా మద్రాసు చేరుకున్నది.
ఐదవలేఖ : “మద్రాసు నాకు బాగా నచ్చింది. ఇక్కడి ప్రజలు కూడా నాకెంతో నచ్చారు”.