ఉద్యమం
డా॥ దాసరి రామకృష్ణ ప్రసాదు9885051179
తెలుగు మాధ్యమ విద్య నాశనానికి కారణం ఎవరు?
ఎంతోమందిమి భయపడుతున్నట్లుగానే తెలుగు మాధ్యమానికి అంత్యక్రియలు జరగబోతున్నాయి. “తాంబూలాలు ఇచ్చేశాం తన్నుకు చావండి " అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చెప్పేశారు.
అట్లూరి పురుషోత్తంగారి పుస్తకం:
నా పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ తెలుగు మీడియంలోనే చదివాను. 1974 లో ఎం.బి.బి.ఎస్. లో చేరాను.
అక్కడ నా తరగతి సహచరులు 150 మందిలో ఇంగ్లీష్ మీడియం నుండి వచ్చినవారు 20 మంది లోపే. ఇంగ్లీష్ లో మాట్లాడటంలో మాత్రం ఇంగ్లీషు మీడియం నుండి వచ్చిన వారు మెరుగ్గా ఉండేవారు. తెలుగు మీడియం వారు ఆంగ్ల మాధ్యమంలో వైద్యవిద్యను అభ్యసించడంలో మొదటి మూడు నాలుగు నెలలు తప్పితే ఆ తరువాత ప్రత్యేకమైన ఇబ్బందులేమీ పడలేదు.
1978 లో అట్లూరి పురుషోత్తం గారు రాసిన 'మాతృభాషలోనే ప్రాథమిక విద్య ఎందుకు '- అనే శీర్షిక క్రింద విశాలాంధ్ర ఆదివారపు సంచికలో వచ్చిన వ్యాసాల పరంపరను చదివాను. ఈ వ్యాసాలన్నింటినీ కలిపి ఆ తరువాత “మాతృభాషలో ప్రాథమిక విద్య" అనే పేరుతో పుస్తకంగా ప్రచురించారు. పిల్లలు తమకు తెలిసిన భాషలో('మాత్చభాష ' లేదా 'సొంత భాష ') తెలియని విషయాలైన సైన్స్, సోషల్, లెక్కలను తెలుసుకోవడం తేలిక గానీ, తెలియని ఇంగ్లీషులో తెలియని సైన్స్, సోషల్, లెక్కలను ఎలా తెలుసుకుంటారు? అనేది పురుషోత్తం గారి ప్రశ్న ఇంగ్లీష్ మీడియం విద్య వలన బట్టీపట్టి అప్పచెప్పడ, రాయడం అలవాటవుతుంది. పోషణ లేని పసిబిడ్డ వలె ప్రశ్న చచ్చిపోతుంది. దాంతో ప్రతిభ కుంటుతూ ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో చదివే తెలుగు పిల్లలు, అంతే వనతులుండి సమర్ధవంతంగా నిర్వహింవబడే తెలుగు మీడియం పాఠశాలల విద్యార్థుల కంటే మేధాశక్తి లోనూ, విజ్ఞానం లోనూ వెనుకబడే ఉంటారు. సృజనాత్మకత తగ్గిపోయి మన సమాజానికి చాలా నష్టం జరుగుతుందని ఆ పుస్తకం ద్వారా నిరూపించారు. ఇంగ్లీష్ మీడియంలో చదివి ఉన్నత స్థితిలో ఉన్న వారిని ఉదాహరణగా చూపించి అందరూ అలానే చదవాలనే మొండి వాదన కొంతమంది చేస్తుంటారు. విద్య, వైజ్ఞానికపరమైన ఆసక్తి గ్రహణ శక్తి (Academic interest) గల మేధావులైన పిల్లలు కొద్ది శాతమే ఉంటారు. వీరు బలమైన గిత్తల్లాంటివారు. ఏటికెదురీద గలవారు. చక్రాలు లేని బండిని కూడా బలమైన గిత్తలు ఎలా లాగ గలవో అలానే వీరు ఏ మీడియంలో బోధించినా తమ ప్రతిభను చూపగలరు. ఆంగ్ల మాధ్యమంతో ఇబ్బంది పడని ఈ కొద్ది మంది. ఐదారు శాతం పిల్లల కోసం మిగిలిన పిల్లలందరినీ హింసించడం సరికాదు.
మాతృభాష ద్వారా విద్యార్థులు కొత్త విషయాలను నేర్చుకుంటారు. పరభాషా మాధ్యమ పాఠశాలల్లో విషయం ద్వారా పరభాషను నేర్చుకుంటారు. ఇంగ్లీష్ మీడియం ద్వారా పిల్లలకు ఎంత హాని జరుగుతుందో లోతుగా ఆలోచిస్తే మాత్రమే బోధపడుతుంది. సామాన్యంగా ప్రతి వ్యక్తి తము మాతృభాష లోనే ఆలోచిస్తాడు. ఇంగ్లీష్ మీడియం ద్వారా విద్య గరపినప్పుడు ఇంగ్లీష్ లో బోధించిన దానిని విద్యార్థి ముందుగా మనసులో తెలుగులోకి తర్జూమా చేసుకుని ఆలోచిస్తాడు. తరువాత ఆలోచించిన దానికి తిరిగి ఇంగ్లీష్ లోనికి తర్జూమా చేసుకుని సమాధానం చెప్తాడు. ఈ క్రమంలో ఎంతో శ్రమ, కాలం వృధా కావటంతో పాటు విజ్ఞాన సముపార్దన కూడా కుంటు పడుతుంది. ఆంగ్ల మాధ్యమం బడులలో చదివే విద్యార్థులకు వారికి తెలియకుండానే మాతృభాష మీద, మాతృదేశం మీద న్యూనత కలుగుతుంది. అమెరికా, ఇంగ్లాండ్ వంటివి మాత్రమే గొప్పవని, ఇంగ్లీష్ భాషే గొప్పదని మన భాష, మన దేశం ఎందుకూ పనికిరావనే చిన్న చూపు ఏర్పడుతుంది. మన భాష, మన దేశం మీద అభిమానం లేని బానిస మనస్తత్త్వం దేశాభ్యుదయానికి, స్వాతంత్య్రానికి పెద్ద ఆటంకంగా తయారవుతుంది.
నా అనుభవం:
ఆడుతూ పాడుతూ కొత్త విషయాలను నేర్చుకోవలసిన బాల్యాన్ని బట్టీయం చదువులతో హింసించి నాశనం చేయడం బాధగా ఉండేది. అప్పటినుండి తెలుగు పిల్లలు తెలుగు మీడియంలోనే చదవాలని ప్రచారం చేస్తూ వచ్చాను.
1978 నుండీ ఈ రోజు వరకు ప్రతిరోజూ కనీసం ఒక్కరితో నన్నా ఈ విషయం మాట్లాడడం నియమంగా పెట్టుకుని పాటిస్తున్నాను. చల్లపల్లి లోని ప్రతి స్కూలుకూ ఇంగ్లీష్ , తెలుగు రెండు మాధ్యమాలూ ఉండేవి. మా ఊర్లోనే కాకుండా చాలాచోట్ల ఉన్న స్మూలు యాజమాన్యాలను “పిల్లలు ఏ మీడియంలో బాగా చదువుతున్నారు” అని తరచుగా అడుగుతుండేవాణ్ణి. “తెలుగు మీడియం పిల్లలకే సబ్జెక్టు లపై అవగాహన పట్టు బాగా ఉంటుంది కానీఎక్కువమంది తల్లితండ్రులు ఇంగ్లీష్ మీడియమే కోరుకుంటు న్నారు కాబట్టి మేము ఇంగ్లీష్ మీడియం కూడా నడుపుతున్నాము” అని చెబుతుండేవారు. “మరి ఇంగ్లీష్ మీడియం పిల్లలకు వారికి అర్ధమయ్యేటట్లు ఎలా నేర్పుతున్నారు?” అని అడిగితే - పాఠాన్ని తెలుగులోనే చెప్పి, ఇంగ్లీష్ లో నోట్స్ చెబుతాము అని చెప్పేవారు. ఏ మీడియంలో చేరడం అనేది తల్లితంద్రుల ఎంపిక తప్పితే పిల్లల ఎంపిక కాదు. కానీ పల్లెటూరు పిల్లలు తల్లితండ్రుల మెప్పు కోసం, టీచర్ల మెప్పు కోసం ఇంగ్లీష్ మీడియంలో చదువుతూ ఎంతో కష్టపడి బట్టీబట్టి పరీక్షలలో మంచి మార్కులు తెచ్చుకోవలసి రావడం చాలా బాధాకరమైన విషయం.
అందుకే తల్లితండ్రులకు అవగాహన కల్పించడానికి 1990 లో అట్లూరి పురుషోత్తం గారితోనూ, 2001 లో విఠపు బాల సుబ్రహ్మణ్యం గారితోనూ బహిరంగ సమావేశాలను నిర్వహించాం.
14
తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * ఫిబ్రవరి -2020