పుట:Dvipada-Bagavathamu.pdf/256

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

212

ద్విపదభాగవతము

రనవుండు ప్రియమంది యమతనూభవుఁడు
ఘనభక్తి హరికి నర్ఘ్యము సమర్పించె.630
బహురత్న భూషణాంబర గంధపుష్ప
విహితభంగుల మంత్ర విధిఁ బూజ సేయ
మునులు రాజులు మనంబుల సంతసిల్ల
ననిమిషావళి వచ్చి యభినుతి సేయ
నాలోన శిశుపాలుఁ డంతయుఁ జూచి
కాలాహిగతి మ్రోసి కరతలంబెత్తి
యొండొండ రోషాగ్ను లొలుకుచుండఁగను
పాండవాగ్రజు జూచి పలికె నుద్వృత్తి

శిశుపాలుఁడు శ్రీకృష్ణుని నిందించుట


“కటకటా! ధర్మజ! కడుచిన్నపాపఁ
డిటుజెప్ప నీబుద్ధి యేల నిట్లయ్యె?
గోపాలకుని జాలికుని సత్వహీను
బాపాత్ముఁ బశుకర్ముఁ బరదారగమను
నేమని పూజించి తిందఱి నడుమ?
ఏమటివాఁడు వీఁడీ యర్ఘ్యమునకు
బలపరాక్రముల భూపతుల సన్మునుల
దలవంపు సేయఁగఁ దగునయ్య నీకు?
ఎఱుగక కూర్మి నీవిచ్చిననైన
తఱిలేచి యర్ఘ్యంబు తానెట్లుగొనియె?
పూజనీయులగు నీ పురుషులలోన
నేజాతిగలవాఁడు! ఇటుపెద్ద సేయ?”640