పుట:DivyaDesaPrakasika.djvu/71

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

18. తిరుక్కణ్ణపురం - 11

(నన్నిలమ్‌ నుండి 7 కి.మీ)

శ్లోకము :

శ్రీ మత్కణ్ణ పురేతు నిత్య సరసీ సంశోభితే ప్రాజ్ముఖం
దేవ్యా కణ్ణ పురాభిధాన సుయుజా శ్రీశౌరి రాజప్రభుమ్‌ |
వైమానే స్థిత ముత్పలా వతక మిత్యాఖ్యేతు కణ్వేక్షితం
సేవే విష్ణు మనశ్శఠారి కలిజిత్ శ్రీ కౌస్తుభాంశ స్తుతమ్‌ |

వివ: శౌరిరాజ పెరుమాళ్ - కణ్ణపురనాయకి - నిత్య పుష్కరిణి - తూర్పుముఖము - నిలుచున్నసేవ - ఉత్పలావర్తక విమానము - కణ్వ మహర్షికి ప్రత్యక్షము - నమ్మాళ్వార్; కులశేఖరాళ్వార్, పెరియాళ్వార్, ఆండాళ్, తిరుమంగై ఆళ్వార్ లు కీర్తించినది.

విశే: ఇచ్చట పెరుమాళ్లు శ్రీదేవి, భూదేవి, నీళాదేవి, గోదా దేవులతో వేంచేసి యున్నారు. పెరియ పెరుమాళ్లు(శ్రీరంగనాధుల) మంగళా శాసనం ప్రకారం శ్రీ విభీషణాళ్వార్లకై ప్రతి అమావాస్యనాడు దక్షిణ తిరుముఖ మండలముగా వేంచేసి సేవ సాయింతురు.

ఈ శౌరిరాజ పెరుమాళ్లను తిరుమంగై ఆళ్వార్ "కుణపాల మదయానై"(ప్రాగ్దిశా దిగ్గజము) యని కీర్తించి యున్నారు. మఱియు ఈ క్షేత్రమును "కీయైవీడు"(క్రింది నగరము) అని అభివర్ణించి యున్నారు. (మేలై వీడు శ్రీరంగము) "ఉత్పలావతకమ్" అనియు విలక్షణమైన తిరునామము గలదు. కృష్ణారణ్యక్షేత్రమనియు, సప్త పుణ్య క్షేత్రమనియు పేరు కలదు.

నమ్మాళ్వార్ "మాలై నణ్ణి" అను తిరువాయిమొழிలో (9-10)"మరణమానాల్ వైకున్దం కొడుక్కుం పిరాన్" అని సర్వేశ్వరుని శరణ్యముకున్దత్వ గుణమును(అనగా ఆశ్రితులైన వారికి మోక్షమును ప్రసాదించు గుణమును)కీర్తించిరి. నమ్మాళ్వార్లు తిరువాయి మొழி(9-10)లో నాల్గు పాశురముల వరకు భక్తిని ఉపదేశించి ఈపాశురమున(5) ప్రపత్తిని ఉపదేశించిరి. "తన శ్రీపాదములను ఆశ్రయించిన వారికి సకలవిధ రక్షకుడగును. శరీరావసానమున మోక్షమును ప్రసాదించును. తనను ప్రేమించిన వారికి తాను ప్రేమకై మూర్తి యగును" అని సర్వేశ్వరునకు గల "మోక్ష ప్రదత్వ" గుణమును ప్రకాశింపచేసిరి.

క్రిమి కంఠచోళుడు ఈ సన్నిధి ప్రాకారములు ఆరింటిని ధ్వంసము చేసెను. దానిని సహింప జాలని "అరయరుస్వామి" పెరుమాళ్లతో "ఇంత జరుగుచున్ననూ ఊరకుంటివే! ఇది తగునా!" యని ప్రార్థించియు పెరుమాళ్లు పలుకక పోవుటచే చేతిలోని "తాళమును" స్వామిపైకి విసిరివేసిరి. అంత పెరుమాళ్లు సుదర్శన చక్రమును ప్రయోగించి చోళుని వధించిరట. ఇంద్కు నిదర్శనముగా పెరుమాళ్లు ప్రయోగచక్రముతో వేంచేసి యున్నారు.