పుట:Dhanurvidyaa vilaasamu (1950).pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బేర్కొనరైరి. ఈ యిర్వుర గురువులును సంస్కృతముననున్న యాయాశాస్త్రగ్రంథముల నెఱుఁగక తత్తద్విషయవిశేషములనే గురుసాంప్రదాయానుసారమున నేర్చుకొని వానిని వారి వారి వ్యవహారభాషలలో వ్రాసికొనియుందురు. ఈగ్రంథమున కృష్ణమాచార్యుఁడు “ఈలక్షణాలను కందాళ వెంకటాచార్యులుగారు చెప్పిన పద్యాలు” అని కొన్ని పద్యాలు చేర్చిరి. అతడు కృష్ణమాచార్యునికంటెఁ దర్వాతివాడు.

నేను కృతిపేరకుని వంశము వారగు రాచూరి జమీందారుగారికి జాబులు వ్రాసి ముద్రణోపక్రమము తర్వాత నొకవ్రాఁతప్రతిని వారివల్ల బడసితిని. కాళహస్తి వ్రాఁతగ్రంథములలో నొకప్రతి తిరుపతి దేవస్థాన పుస్తకశాలకు లభించింది. ఈ రెంటి సహాయము లేకున్నచో నేతద్గ్రంథముద్రణ మీతీరుననేని నెఱవేఱకపోయెడిదే.

రాచూరు జమీందారు గారగు శ్రీ కృష్ణానేని హయగ్రీవరావుగారు వారివ్రాఁతప్రతి నొసగియు, తమవంశచరిత్రాది సాధనములను తమయుద్యోగి శ్రీ కోపల్లె రామకృష్ణరావుగారి ద్వారమున పంపియు, శ్రీ మానవల్లి రామకృష్ణకవిగారు తమదగ్గరనున్న ధనుశ్శాస్త్రగ్రంథముల నీపీఠికారచనకాలమున నొసగి, ప్రతిదినము ఉదయము వచ్చిన ప్రూపులను నాఁడే వానిని మద్రాసు పంపుటలో నాకు చిరంజీవి పంగనామముల బాలకృష్ణమూర్తి బి. ఓ. యల్ (ఆనర్సు) నా సహాయోగ్యోగి చాలదోడ్పడియు, విద్యాజన్మవంశములందు సంతానమగు చిరంజీవులు శ్రీనివాస, సచ్చిదానందులు; సుందరమూ ర్త్యానందమూర్తులు నన్ననువర్తించి యుపకరించిరి.

విరోధి మాఘపూర్ణిమ

వేటూరి ప్రభాకరశాస్త్రి