పుట:Dashavathara-Charitramu.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కాలులు మయవిశ్వకర్మలు జంభవృషాకపు ల్ద్విశిరోనిశాకరజులు
మాతృకోత్కలులు దుర్మర్షణవామదేవులు నముచ్యపరాజితులు పులోమ


తే.

నీలులును మేఘదంభావనీతనయులు, కాలకేయమరుత్తులు కమలమిత్ర
తనయనరకాసురులు నివాతకవచపవ, మాను లొండొరుల్ వోరుసమయమునందు.

383


మ.

కవచస్ఫూర్తి నభేద్య మౌ కవచ మేకంబైనబాణంబుచే
నవియించెన్ రథరథ్యసారథిపతాకాద్యంబుల న్నాలుగిం
ట విచారించె సురేంద్రు డగ్గఱి భుజాటంకంబునం దైత్యదా
నవచూడామణి యట్టహాసమునఁ గాండం బెల్ల ఘూర్ణిల్లగన్.

384


క.

మఱియుం దఱచుగ శరములు, గఱిగఱి గఱువంగ నేయఁగా వెఱవక య
త్తెఱగంటిరాయఁ డప్పుడె, యఱిముఱిఁ బ్రతిశరము లేసి యన్నిటిఁ ద్రుంచెన్.

385


సీ.

కోపంబు మీఱఁగాఁ జాపంబు చేపట్టి రోషంబుచే దానిరూ పడంచె
శూలంబుఁ గైకొని ఫాలంబు వొడువరా వాలముచే దాని వ్రేలఁజేసెఁ
బంతంబు మీఱఁగాఁ గుంతంబు గైకొన్న నంతంబు నొందించె నస్త్రనిహతి
గండంబు గుఱి సేసి దండంబు వైచిన ఖండంబు గావించెఁ గాండమునను


తే.

మఱియు నేయాయుధము లూన మనుజభోజి, తత్తదాయుధములఁ ద్రుంచెఁ దత్క్షణంబ
యమృతసేవయు హరికటాక్షమును గలుగఁ, గలదె యీడును జోడు నాఖండలునకు.

386


శా.

ఆగ్నేయాస్త్రము దేవతాధిపతి యేయం దానిచే భగ్గునన్
భగ్నంబయ్యె మహారథంబు దివిజప్రత్యర్థిరాజేంద్రుఁ డు
న్మగ్నుండౌట నదుృశ్యుఁడై చనియె నానాదైత్యసంఘాత ము
ద్విగ్నంబయ్యె సుధాశను ల్సెలఁగి రుద్వేలప్రమోదంబునన్.

387


వ.

అంత నిటులు నలోచనగోచరుండై చనినవిరోచననందనుండు కృతగర్వవి
మోచనుండై తననేర్పు మెఱసి మాయావి యగుచు నెల్లెడలఁ దోఁచి పెల్లుగ
నాక్రమించెడుమాయ గావించిన.

388


సీ.

కులశైలమున వాన గురియంగ గిరిభేది యంగంబు గులగులనయ్యె మిగుల
లయకాలదహనకీలలు సుట్టుకొని యేర్చి పరితపింపఁదొడంగెఁ బావకుండు
మృత్యుపాశంబులు మెడఁబట్టి తివియఁగా మొఱలు వెట్టఁదొడంగెఁ ధరణిసుతుఁడు
బేతాళములు నీళ్ల వ్రేసి త్రొక్కఁగఁ బాశి యుదు టెల్లఁ బెడఁబాసి యుడ్డుగుడిచెఁ


తే.

బెక్కుభూతంబు లితరులపీచ మణఁచె, నే మనఁగవచ్చు వానిమాయామహత్త్వ
మహహ యింద్రాదులేల బ్రహ్మాదులైన, మెదలఁగాఁజాల రావేళ నెదుటఁబడిన.

389


వ.

అదియునుంగాక.

390