పుట:Dashavathara-Charitramu.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

చెఱకువిలుకాఁ డురంబున మెఱుఁగుసాన, పైని మొనయిడు కాంచనాంబకమురేఖ
యనఁగఁ జూపట్టె జలధికన్యాలలామ, పద్మనాభుని ఘనభుజాభ్యంతరమున.

290


తే.

ఇంపు దళుకొత్త లచ్చి ఱొమ్మెక్కినపుడె, జలధిమథనప్రయాసంబు దలఁపఁడయ్యె
హరి యిటులుగాదె యెందుఁ గార్యంబు సఫల, మైననేటికిఁ బూర్వప్రయాసగణన.

291


తే.

ఈక్రమంబున సకలలోకైకజనకుఁ, డైన శ్రీహరి విపులబాహాంతరమున
నఖిలలోకైకమాత శ్రీ యధివసించి, ప్రజలఁ గనుఁగొనెఁ దాఁ గన్నప్రజలరీతి.

292


క.

శ్రీలావణ్యవతీకరు, ణాలోలకటాక్షవీక్షణాళులు సుమనః
పాళుల వ్రాలెఁ గర్బుర, జాలంబులఁ జేరవయ్యె సహజస్ఫూర్తిన్.

293


క.

అకలంకరూపరేఖా, నికషోద్భవభూరిగరిమ నిరసించిన ల
క్ష్మికటాక్షంబునఁ దలఁచిరి, నికషోద్భవభూరిగరిమ నిరసించి సురల్.

294


తే.

శ్రీకృపామృతవృష్టిసంసిద్ధివలన, జనులదారిద్ర్యతాపంబు శాంత మయ్యె
నఖిలజాతులు నామోదమంది చెలఁగె, సత్ప్రతత్పరమయ్యె ద్విజవ్రజంబు.

295


వ.

అంత మఱియు దెఱగంటిదొరలు వేడుక రక్కసులం గూడుకొని కలశజల
నిధి మథియించు సమయంబున.

296


మ.

సురలుందైత్యులు మేరమీఱి తను సంక్షోభించి సర్వస్వమున్
హరియింపంగఁదొడంగినా రనుచు నానావకాశంబుల
న్మొఱవెట్టంగఁ దొడంగెనో యనఁగ నంభోరాశి కల్లోలము
ల్మొఱసె న్వాసుకిభూరిభూత్కృతి మరుల్లోలంబులై యత్తఱిన్.

297


క.

తనగంధాఘ్రాణముచే, తనె లాహిరి గొనఁగ దేవదానవు లబ్ధిం
జనియించె మదిర దానిం, గొనె నాసురవితతి మిగులఁ గుతుకం బమరన్.

298


సీ.

ప్రజలతల్లి యనంగఁ బరఁగు హరీతకి దక్షిణపాణిపద్మమునఁ బట్టి
వ్రణిదుష్టరక్తపత్వమున మించుజలూక వామహస్తంబున వలనుపఱిచి
రమణీయనవసుధారసపూర్ణకుంభంబు సవ్యశయంబున సవదరించి
యఖిలదేవశ్రేణి కభయప్రదాతృత్వ మపసవ్యకరమున నవధరించి


తే.

కనకచేలాద్యలంక్రియల్ కమలదళవి, శాలనేత్రంబు లసితాంగసౌకుమార్య
మమలగుణగౌరవము మించు నచ్యుతాంశ, మగుచు ధన్వంతరి జనించె నమృతజలధి.

299


తే.

అతని చేతిసుధాకుంభ మపహరించె, విప్రజిత్తి బలాఢ్యుఁడై [1]వేగ వాని
చేతిది హరించె జంభుఁ డక్షీణబలుఁడు, వానిచేతిది గొనియె నిల్వలుఁడు గడిమి.

300


వ.

అప్పుడు.

301
  1. వేగ నతని, చేతిది హరించె జంభుఁ డక్షీణదంభుఁ, డతనిచేతిది గొనె నిల్వలాసురుండు,