పుట:Dashavathara-Charitramu.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

నిస్తులమై నిస్తులతే, జస్తులమై దీప్యమానసకలదశదిశా
వాస్తుభమై కలశాంబుధిఁ, గౌస్తుభరత్నంబు తరణికరణిఁ జనించెన్.

250


సీ.

అమృతంబు ద్రావునీలాభ్రమో యిది గాదు కప్పుపెన్నెఱి గొప్పుకొప్పు గాని
మరలఁబుట్టెడు చందమామయో యిది గాదు మొలకనవ్వుల ముద్దుమోము గాని
ప్రభవించునమృతకుంభంబులో యివి గావు కఠినవక్షోజయుగ్మంబు గాని
జలధిఁ బుట్టిన పూర్వజగతియో యిది గాదు మహితనితంబబింబంబు గాని


తే.

యనుచు నామస్తకము క్రమంబునను నిర్వి, కల్పసవికల్పవిజ్ఞానగతి గణింపఁ
గా సురాసురు లతులశృంగారగరిమ, క్షీరవార్ధి జనించె లక్ష్మీమృగాక్షి.

251


తే.

ఆరమాసతిరూపరేఖాతిశయము, వర్ణనము సేయఁ దరమె యెవ్వారి కైనఁ
గాంచినప్పుడె చిత్రతఁ గాంచె సకల, దైవదానవరాజి చిత్రంబు గాఁగ.

252


శా.

శ్రీరాజీవముఖీవినూతనతనూశృంగారరేఖాదిదృ
క్షారంభంబున దేవతావళి సహస్రాక్షత్వముం గోరె వి
స్తారప్రీతి సహస్రనేత్రుఁ డయుతాక్షత్వంబు [1]గాంక్షించె నౌ
రౌరా యాసకు మేరలే దనుట సత్యంబే కదా ధారుణిన్.

253


వ.

అంత.

254


తే.

పద్మగర్భాదినిర్జరప్రార్థ్యమాన, యగుచుఁ బద్మావధూటి దేవాధినాథ
ఘటితమణిపీఠి వసియించెఁ గమలమధ్య, మునను జెలువందుకలహంసికను హసించి.

255


క.

“పుణ్యాహ” మనుచు నప్పుడు, పుణ్యాహము చేసె వాగ్విభుఁడు భూమిని నై
పుణ్యార్పితనవపల్లవ, పుణ్యోదకపూర్ణకలశములు చెలువొందన్.

256


సీ.

పాథోధరశ్రేణి పటహభేరీశంఖపణవాదివాద్యవిభ్రమము నెఱప
నప్సరోభామినుల్ హస్తాభినయలీల నర్థముల్ దెలియ నృత్యంబు నలుప
గంధర్వకలకంఠకంఠులు స్థాణువుల్ ననలొత్త మధురగానంబు సేయ
జయలోకపావని జయజగజ్జనయిత్రి జయలక్ష్మి యని సుర ల్సన్నుతింపఁ


తే.

జారుతరదక్షిణావర్తశంఖములను, విమలగంగాదినదులతో యములు ముంచి
యాగచోదితమంత్రరహస్యములను, బద్మ నభిషిక్తఁ జేసిరి బ్రహ్మఋషులు.

257


ఉ.

శ్రీమహిళాలలామ కభిషేకముఁ జేసె దిగంతదంతు లు
ద్దామకరప్రకాండసముదంచితకాంచనకుంభసంభృత
శ్రీమహనీయతోయములచేతఁ దదీయకచాళికోమల
శ్యామలభృంగపాళికి నవాబ్జమరందము నించుకైవడిన్.

258


క.

హస్తముల కొసఁగు మిపుడె ప్ర, శస్తోరుశ్రీల ననెడిచందమున దిశా
హస్తులు లక్ష్మీశైలే, శస్తని కభిషేచనోపచారము సలిపెన్.

259
  1. గామించె