పుట:Dashavathara-Charitramu.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శా.

భామా యేటికిఁ జిన్నవోయెదవు నీభావంబు నేఁగంటి నా
కేమౌనో గరళంబుచే ననుచు నీ వెంతే [1]విచారించె దం
దేమీ గా దటుగాక నేమయినఁ గానీ సర్వలోకాళికిన్
క్షేమంబైనను జాలుఁ దద్విషము భక్షింతున్ వినోదంబుగన్.

222


క.

వచ్చినవారికి నాపద, వచ్చిన నది పరిహరించువాని ప్రభుత్వం
[2]బెచ్చౌను గాని మఱి పొర, పొచ్చెము గావించినం బ్రభుత్వము గలదే.

223


తే.

పరులఁ బీడించుకంటెఁ బాపముఁ బరోప, కృతి యొనర్చుటకంటె సుకృతము లేదు
పరుల కుపకృతిఁ జేసిన భాగ్యశాలి, యిహముఁ బరమును జెందుఁ బూర్ణేందువదన.

224


క.

అని యుత్సహించి కలశీ, వనరాశితటంబుఁ గదిసి వసుధాధరరా
ట్తనయాధిపుఁ డవ్విషముం, గని హరియింపంగ వశముగా కడలంగన్.

225


తే.

అంత బ్రహ్మదిసురలు భయార్తు లగుచుఁ, దన్ను బ్రార్థింప శ్రీహరి తద్విషంబు
ధీరుఁడై యారగించిన దేహమెల్ల, నల్లనయ్యెను వ్యాపించి నాఁటనుండి.

226


తే.

హరియు మిగిలినవిషము కాలాంతకునకుఁ, గొంత యొసఁగిన హరుఁ డది ఘుటిక సేసి
మ్రింగ నది కంఠమున నిల్చె హృదయనిహిత, గరుడవాహనవీక్షణాగతభయమున.

227


క.

ఫాలాక్షుఁడు కబళింపఁగ, హాలాహలవిషము కొంత యవశిష్టం బై
తూలఁగ నది వృశ్చికములు, వ్యాళంబులు మెసవి విషధరాఖ్యల వెలసెన్.

228


క.

ఈలీల దైవకరుణన్, హాలాహలబాధ యుడిగి యమరాసురు లు
ద్వేలముదంబున మందర, శైలంబునఁ గడలిఁ ద్రచ్చుసమయమునందున్.

229


చ.

గొరిసెలయందముం గుఱుచ కొమ్ములచందము వెన్ను మందమున్
గరువపుమేనిలో నుదుటు కాఁగెడు పెన్పొదు గింద్రనీలముం
బెరసినముక్కు మీఁగడబలెం జెలువౌ గళకంబళంబునన్
హరు వగుకామధేనువు సుధాంబుధిఁ బుట్టె నక్షీష్టధాత్రియై.

230


వ.

అంత.

231


క.

సురభిన్ సవనవనాపన, సురభిన్ స్రనదమృతగళితశుష్యన్నానా
సురభిం గైకొనిరి మురా, సురభిత్కృప దేవఋషులు సురుచిరభక్తిన్.

232


తే.

మొదటనున్న నిజాకారమును ద్యజించి, వారిరాశితరంగ మువర్ణసహిత
మై తురంగంబు గాఁబోలు ననఁగఁ బొడమె, వెల్లవారువ మాపాలవెల్లి నంత.

233


సీ.

కర్పూరకదళికాకళికాదళంబులు నెఱమించు విదళించునిక్కుఁజెవులు
నేలినవానికిఁ ద్రైలోక్యసాంబ్రాజ్యలక్ష్మి నియ్యగఁజాలు లక్షణములు

  1. ని భావించెదం
  2. బెచ్చౌ నెచ్చట మఱి