పుట:Dashavathara-Charitramu.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మలయు రాయంచకొదమసామ్రాణి నొక్క, సాది దెచ్చినఁ జూచి ప్రసాది యగుచు.

66


మ.

ఎలమి న్బంగరులెక్కపక్కెరహుమాయీతేజి దాఁటించుచు
న్నలుమోమయ్య హుటాహుటిం గదలెఁ జెంతం జేరి జేజేలరా
యలు సాహోయని హెచ్చరింప సుభటోద్యత్ఖడ్గకాంతిచ్ఛట
ల్వలిపెంపుం దెలిచల్వపావడలు వైవ న్దుందుభు ల్మ్రోయగన్.

67


శా.

ఈలీల న్సుర లెల్లరు న్గొలువ వాణీశుండు శీఘ్రంబుగాఁ
గైలాసంబున కేగి శంభునకుఁ దత్కార్యం బెఱింగించిన
న్ఫాలాకుం డొకకొంతసేపు మదిలో భావించి వైరోచని
న్దూలింపన్ హరి వేఁడఁబోద మని తోడ్తో సంభ్రమం బెచ్చఁగన్.

68


ఉ.

గుబ్బలిపట్టిగబ్బివలిగుబ్బల జొబ్బిలు తావికుంకుమం
గబ్బికొనంగఁ జాలు నెదఁ గప్పిన బెబ్బులివన్నెపచ్చడం
బబ్బురమై తనర్పఁ బ్రమథావలి యుబ్బుచు వెంటనంటఁగా
గిబ్బవయాళితేజి దుమికించుచు వచ్చె మహేశుఁ డత్తఱిన్.

69


క.

ఈరీతి సకలనిర్జర, వారము గొలువంగ భవుఁడు వారిజభవుఁడున్
క్షీరాంభోనిధితీరముఁ, జేరి నతుల్సలిపి నుతులు చేసిరి భక్తిన్.

70


సీ.

ఎయ్యది ప్రకృతివిహీనమై సచ్చిదానందనిత్యప్రపూర్ణత వెలుంగు
స్వగతసజాతివిజాతీయభేదముల్ గాంచు నెయ్యది సర్వకాలమునను
జీవేశ్వరాఖ్యలఁ జెలఁగు నెయ్యది యవిద్యయు విద్యయు నుపాధియై తనర్చు
జ్ఞానంబు జ్ఞేయంబు జ్ఞాతయుఁ దానయై వర్తించు నెద్ది సర్వంబునందు


తే.

నట్టివేదాంతవేద్య మాద్యంతరహిత, మమలయోగీంద్రనిష్ప్రపంచాభిధాన
లక్షలక్షిత మపవర్గలక్షణంబు, నైన బ్రహ్మంబు మూర్తమై యలరుఁ గాఁత.

71


సీ.

ఎవ్వఁడు 'తత్త్వమసీ'తి వేదాంతవాక్యంబు వాచ్యార్థమై యలరుచుండు
నెవ్వనికనుసన్న నీచరాచరములం బుట్టించు మాయ యద్భుతము గాఁగ
నెవ్వఁడు వరయోగిహృదయాబ్జమునఁ బరంజ్యోతిస్వరూపుఁడై యొప్పు మిగులు
నెవ్వఁడు లక్ష్మీసమేతుఁడై క్షీరాబ్ధి ఫణిరాజుశయ్యపైఁ బవ్వళించు


తే.

నెవ్వఁ డఖిలజగత్త్రాణహేతుభూతుఁ, డెవ్వఁ డానతసజ్జనాభీష్టదాత
యెవ్వఁ డఖిలగుణాస్పద మెంచ నట్టి, శ్రీవధూనేత సాక్షాత్కరించుఁ గాఁత.

72


వ.

అని యివ్విధంబున నంభోజసంభవశంభుదంభోళిధరప్రభృతు లదంభగంభీరవ
చోనిగుంభనంబులం బొగడుచున్నసమయంబున.

73


సీ.

దంతిమహాపద్మధనదక్షుఁ డగువాఁడు పద్మాప్తవత్సవిభ్రమమువాఁడు
కరగతశంఖచక్రవిజృంభణమువాఁడు మకరకుండలదీప్తి మలయువాఁడు