పుట:Dashavathara-Charitramu.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


విడువలేఁడయ్యె దుర్వాసుఁ డడుగనేల, యంశఫలమే ప్రధానమౌ నఖిలమునకు.

45


క.

దుర్వాసుఁ డిటులు శాపము, దుర్వారముగా నొసంగి తొలఁగిన నెంతే
నిర్వేదన మదిఁ బర్వఁగ, నుర్వీధరవైరి నిజపురోముఖుఁ డగుచున్.

46


తే.

అకట యొకతప్పు సైఁపక యతి శపించె, ముక్కుననె యుండుఁ గోపంబు మూర్ఖమునికి
నెఱిఁగి పూజింపలేనైతి నేను మున్నె, యింకఁ జింతింప నవ్వరే యెవ్వ రేని.

47


సీ.

ఊరకెయుండక యుబుసుపోకలకునై యేనేలవచ్చితి నిట్టిపనికి
వచ్చిన నేరమే వలసినచోటికి నేను రా మౌని రానేల యిటకు
వచ్చినవాఁడు ద్రోవనె పోక పూవండ నేటికి నామీఁద నెగురవైచె
వైచిన నది గొని వరభక్తి ముడువక కరి కేల యిచ్చితిఁ గండక్రొవ్వి


తే.

యంతమాత్రంబునకె మౌని యలుగనేల, యింత లేసులు రానేల యేమి సేయ
నింక నెవ్వరివేఁడుదు నేది దిక్కు, హా విధీ యెంత చేసితి వనుచు వగచి.

48


సీ.

ఐరావతారోహమై రాదు తెలితేజ తెమ్మన్నఁ గానక తిరుగు సాది
సంగీతమేళ మచ్చరలఁ బిల్వుఁడటన్న వెదకి లేరని వచ్చు వేత్రధరుని
నందనవనిఁ గల్పనగములు లేవని పలుకరించిన వనపాలకులను
గామధేనువు దొడ్డిఁ గాన మెందేగెనో యని విన్నవించు గోష్ఠాధిపతిని


తే.

బృథులచింతామణీభద్రపీఠిఁ గొల్వు, చావడిని లేమిఁ దెల్పు సంచారికులను
బొక్కసము శూన్య మగుటకుఁ బొగులు వారిఁ, గాంచి దేవేంద్రుఁడు విచారకలితుఁ డగుచు.

49


తే.

చిన్నవోయినమోమునఁ జేరవచ్చి, దివిజపురి యెల్ల నేనుఁగుదిన్న వెలఁగ
పంటివలె రిత్త యగుచు [1]నప్పటికి నున్నఁ, గాంచి యతఁ డుండె నిఱుపేదకరణి నంత.

50


సీ.

పని గల్గి పిలువనంపినఁ జేరరారైరి దినముఁ గొల్వఁగ వచ్చుదిగధిపతులు
నెన్నఁటివలె సప్తఋషులు వేగినవచ్చి "విజయో స్త" టంచు దీవింపరైరి
సంబళంబు లొసంగి సంతరింపఁగలేమి విడిచి పోవఁదొణంగె విబుధబలము
భయభక్తిముక్తి నెప్పటి[2]మేరఁ దనయాజ్ఞఁ బాటింపదయ్యెను పౌరజనము


తే.

మించి మం డొడ్డసాగెను మిత్రకులము, గడల కేగిరి తగునూడిగములవారు
బయలుదేఱిన సుతుఁడు లోపలను సతీయు, గాని యన్యులు లేరైరి ఖచరపతికి.

51
  1. నప్పంటికున్నం
  2. వలెఁ