పుట:Dashavathara-Charitramu.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.

ఓమునిసార్వభౌమ తపనోపమధామ గుణాభిరామ సు
త్రామముఖామరు ల్భవదుదంచితకీర్తులు సన్నుతింపఁగా
నేమును విందు విూపదము లెన్నఁడు నేఁ గనువిందు సేయ నేఁ
డీమెయి సంభవించె ఫలియించెను గోరిక లెల్లఁ గొల్లగన్.

15


క.

కావలసినఁ గైకొనుమా, పావన మగుఁగాక నాదుభవమదవీయం
బీవన మంచు మునీంద్రున, కావనిత ప్రసూనదామ మామోదమునన్.

16


క.

ఇచ్చిన మచ్చికఁ బుచ్చుక, యచ్చెలి మెచ్చుచు మునీంద్రుఁ డౌఁదలఁ దాల్చెన్
జిచ్చుఱకనుదేవర వై, యచ్చరనదిఁ దాల్చుచెలువ మచ్చుపడంగన్.

17


తే.

ఇటుల దాలిచి సంతుష్టహృదయుఁ డగుచు, మరలి కరమునఁ గైకొని మమతమీఱఁ
గన్నుఁగవ నొత్తికొనుచు వక్షంబుఁ జేర్చి, కంఠమున వైచి యవల నుత్కంఠఁ జనుచు.

18


సీ.

గంధర్వు లగ్రభాగమున జోడనమించు ఘోటుల దుమికించుకొనుచు నడువ
వెనుదండ యుద్దండవేదండకాండము లమదమంధరయానసరణి నడువ
నిరువంక నకలంకవరరత్ననిర్మితహాటకరథకోటు లరుగుదేర
వెలిడాలు గ్రమ్మించు విచ్చుకత్తుల వేల్పుమూఁక లెల్లెడలఁ గ్రముకొని నడువ


తే.

రంభనాట్యంబు మిగుల సంరంభ మెసఁగ, వెల్లయేనుఁగు నెక్కి ఠీవెల్ల మెఱయ
వెలయు వేడుక వాహ్యాళి వెడలివచ్చు, నమరనాయకుఁ గాంచి సంయమివరుండు.

19


తే.

చేతి పూదండ పైని వైచిన సురేంద్రుఁ, డది కరంబునఁ గైకొని మదకరీంద్ర
కుంభమున నిల్పఁ జెలువయ్యె శంభుశైల, శృంగసంగతగంగాతరంగిణి యన.

20


తే.

అంతఁ జంచలకుంభికుంభాగ్రనిహిత, పుష్పదామంబు దిగజాఱి భూమిఁ బడియె
దేవవిభురాజ్యగర్వతమోవినాశ, సూచకంబయి పడు తోఁకచుక్క యనఁగ.

21


వ.

అంత

22


క.

శీకరమదధారాజల, శీకరభీకరము ప్రోల్లసితమధుపాళీ
శ్రీకర మౌ కరమున గం, ధాకరమాల్యంబు దిగిచి యత్తఱిఁ గడఁకన్.

23


తే.

చరణముల వాలి కర్ణదేశముల సోలి, యాశ్రితాళులు మొఱవెట్ట నాలకింప
కలరుసరి రాచె మదకరి యంతెకాదె, యాశ్రితులయుక్తు లేల మదాంధులకును.

24


క.

ఈమెయిఁ దా నిచ్చిన సుమ, దామము సామజము దిగిచి ధరఁ బొరలింపం
గా ముని గనుఁగొని తొలుతం, గాముని హరియించుహరునిగతి నుగ్రుండై.

25


చ.

కటతటముల్ చలింపఁ గడకన్నుల నిప్పుక లుప్పతిల్ల భ్రూ
కుటి నటియింప నెమ్మొగము కోటిరవిప్రతికోటి గాఁగ వి