పుట:Dashavathara-Charitramu.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

తిమితిమింగిలముఖ్యదీర్ఘమత్స్యంబులఁ గొమ్మునఁ గుదులుగాఁ గుచ్చి యెత్తు
దనసంతతికి మేతఁగొనివచ్చురీతి దిక్కరిశరీరంబుల గరులనాను
దృఢవాలమున గట్టు లెగయంగఁ గొట్టుచుఁ గేలిమైఁ గందుకక్రీడ సలుపు
నుగ్రసత్త్వాహార ముపశమించుటకు నా బడబానలము గ్రోలి పాఱవిడుచు


తే.

నాశరచ్ఛేదనముఁ దృణప్రాయముగను, జలుపు టేవింత యదియె కావలె నటన్న
గుటుకుమనకుండ బ్రహ్మాండకోటి మ్రింగి, సప్తజలధులు ద్రావదే క్షణములోన.

290


క.

అని మంత్రులు వినిపించిన, విని నవ్వుచు లేచి దైత్యవిభుఁ డది యేదీ
కనుఁగొందము గా కని తను, దనుజులు గొలువంగ వార్ధితటగతుఁ డగుచున్.

291


మ.

కనియె న్దానవసార్వభౌముఁ డెదుటం గల్పాంతపాథోధిరా
డనుగామీనము సాధులోకవిపదాయాసచ్ఛిదావ్యాజసం
జనితోద్యత్కరుణాధృతాయతతరీసప్తర్షిభూమీనము
న్ఘనదంష్ట్రాంగవిభాజితాయుతతమీకామీనము న్మీనమున్.

292


చ.

కని యిది మీను గాదు లయకాలమహాబలనీయమాన కాం
చనకుధరంబ యంచు మది సందియమందుచుఁ గాలరుద్రశూ
లనిభసహస్రదంష్టలు జ్వలద్బడబానలకీల లోలిలో
చనములు ధూమకేతుసదృశంబగు వాలము చూచి నివ్వెఱన్.

293


మ.

ఇది మీనంబగునైన నేమి యసిచే నింతింతగాఁ ద్రుంతునో
కుదియంగొట్టుదునో గద న్నిశితమౌ కుంతంబునం గ్రుచ్చి యె
త్తుదునో మీఁదికి నిప్పుడంచు మిగుల దుర్వారగర్వాంధుఁడై
కదియంజూచి మృషాఝషాధిపుఁడు జాగ్రద్వాల మల్లార్చుచున్.

294


తే.

శార్ఙ్గలీలావినిర్ముక్తశరముల రిపు, సేనఁ గీలాలసిక్తంబు సేయుశౌరి
శార్ఙ్గలీలా వినుర్ముక్త శరముల రిపు, సేనఁ గీలాలసిక్తంబు సేసె నపుడు.

295


ఉ.

ఓరినిశాచరాధమ పయోరుహగర్భుఁడు నిద్రవోవఁగా
నూరక యేల తెచ్చితివి యుత్తమవేదము లందు నేమిచే
కూరెను నేఁడు నీ కకట క్రోఁతికి మానిక మేల గూలఁగాఁ
గారణముంటఁ జేసి చెడుకార్యము చేసితి వింతె యిమ్మెయిన్.

296


క.

అన విని నీవా యెవరో, యనియుంటిని మంచికార్యమాయెను నేఁ జే
సినపుణ్యంబునఁ గా నినుఁ, గనుఁగొనఁగాఁ గలిగె నింతకాలంబునకున్.

297


శా.

నే నేదిక్కునఁ జూతునో యనుచు నెంతేభీతి వారాశిలో
మీనంబై మిడుకంగఁ జొచ్చితి వయో మేలే హరీ దీనికిం
కే నేమందును డాఁగఁబోయినఁ దలారిల్లయ్యె నేఁ డేడకుం
బోనౌఁ జిక్కితి వంటయింటిశశమై బోనంపుఁ బెన్గూటికిన్.

298