పుట:Dashavathara-Charitramu.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఘటియింపందగు దైత్యనేత కని దోర్గర్వం బఖర్వంబుగన్.

279


తే.

గాలములు వైచువా రది కాదటంచుఁ, బెనువలలు వేయువా రవి పనికిరావ
టంచు వడిగా రచెక్కకై యరుగువారు, నైన యసురుల కనియె నమ్మీనమూర్తి.

280


ఉ.

ధీవరులార గాలము తుదిం బలంబుగ నెఱ్ఱగ్రుచ్చి మీ
రీవగ వైచినం దగుల నేటికి నేఁటికి వింతమాంసమున్
గావలెనంచు వచ్చితిని గావుననేవలెనన్న మీ హయ
గ్రీవుని గ్రుచ్చి వైవుఁడు హరింపుదు నంతట మిమ్ముఁ జేరుదున్.

281


ఉ.

ఇంత ప్రయాస మేల చనుఁ డిప్పుడ యంచును వారు సూడఁ దా
నింతయి యంతయై వెనుక నేనుఁగయంతయి కొండయంతయై
యెంతయుఁ బెద్దయై కడలియెల్లెడ నిండి సహస్రయోజనా
క్రాంతతనూవిలాసమునఁ గన్పడఁ జూచి నిశాటసైనికుల్.

282


క.

నరభక్ష్య మైనమీనము, నరభోజనభక్ష్య మౌ ననఁగఁ జిత్రం బే
పరికించెద మిట నేఁడా, సురపతి నిను దినుట నీ వసురపతిఁ దినుటల్.

283


మ.

పదరం గారణ మేమి యంచు దనుజు ల్బాహాబలప్రౌఢిచేఁ
గదల న్మోఁదుచు నీఁటెలం బొడుచుచున్ ఖడ్గంబులం జించుచుం
గదియ న్గన్గొని మత్స్య మొక్కపరి శృంగం బట్టిటుం ద్రిప్పఁగా
నుదరంబుల్ శిరముల్ దెగంబడిరి దైత్యు ల్వేనవే లొక్కటన్.

284


శా.

ఆవార్తల్ హతశేషసైనికులచే నాలించి సేనాని దా
నీవేళం జని దానిఁ దెత్తునని వే యేతేరఁ ద ద్వాలలీ
లావిక్షిప్తమహానగాళిపయి వ్రాలం గూలె సైన్యంబుతో
దేవారాతివరూథినీవిభుఁడు మధ్యేరాజమార్గంబునన్.

285


వ.

అంత.

286


శా.

వాలోత్క్షిప్తగిరు ల్సురారివురిపై వ్రాల న్విశీర్ణంబు లై
రాలె న్గోపురముల్ గృహంబు లురిలెం బ్రాసాదముల్ నుగ్గులై
తూలె న్గోటలు మ్రగ్గె సౌధములు దోడ్తో ఛిన్నభిన్నంబు లై
వ్రీలె న్మండపపంక్తు లొడ్డగిలె నావిర్భూతఘోషంబునన్.

287


తే.

వానిలోపల నొక్కపర్వతము వచ్చి, తాను గొలువున్న కేళిసౌధమునఁ బడినఁ
బెగిలి పైఁబడఁ జేతులఁ బట్టి యవల, వైచి వెల్వడివచ్చి నిశాచరుండు.

288


తే.

అగమురాఁ గారణం బేమి యనుచు మంత్రి, జనుల నడిగిన వారలు వినయమునను
దేవ యొక పైఁడిచోఱ యీదీవి చేరి, విస్మయము సేయుచున్న దీవివిధగతుల.

289