పుట:Dashavathara-Charitramu.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

ఇదె కనుఁగొమ్మటంచు నిటలేక్షణరూక్షకటాక్షవీక్షులన్
గుదిగొని నిప్పు లుప్పతిల ఘోరతరభ్రుకుటీకరాళమై
వదనము భానుమండలము వైఖరి జేగుఱుచాయ మించఁగా
గదఁగొని త్రిప్పివైచె లయకాలమహోద్ధతి [1]తీరుమీఱఁగన్.

299


తే.

ఆగదాదండ ముద్దండమగుచుఁ దాఁకి, తోఁక వెండ్రుక యైనను దులుపదయ్యె
నేమి చెప్పుదు బృథురోచనామధేయ, మపుడు సార్ధకమయ్యె మత్స్యంబునందు.

300


వ.

అంత.

301


మ.

ఘనరోషంబున మీనమూర్తి నిజశృంగం బెత్తి తీరస్థుఁడై
మనుజాశిప్రభు నేయఁగాఁ దెగియె రంభాస్తంభముంబోలి త
త్తను వచ్చో నరుణోదయం బయినచందంబొప్ప రక్తౌఘము
ల్వనధిం దేలె వినిద్రతం దగెఁ జతుర్వక్త్రాబ్జము ల్బ్రహ్మకున్.

302


తే.

నిదుర మేల్కొని వేదము ల్నెమకి కానఁ, జాల కంభోజభవుఁ డబ్ధిఁ దేలియాడు
మీనమూర్తిఁ గనుంగొని మేనువొంగఁ, జేరి ప్రణమిల్లి సన్నుతి చేసె నిట్లు.

303


శా.

శ్రీమీనాకృతయే నమోభగవతే సృష్ట్యాదిసంధాయినే
హైమాహార్యరుచే హృతానతశుచే సారావపాథోముచే
సాముద్రాంబువిహారిణే దితిజనుస్సంహారిణే హారిణే
స్వామి న్పాహి కృపాహి తే హితతరా సర్వేషు దేహి శ్రుతీః.

304


మ.

అని వర్ణించు సువర్ణగర్భునకు వేదాళిం బ్రసాదించి గ్ర
క్కనఁ ద్రైలోక్యము సృష్టి సేయుమని శ్రీకాంతుండు పంప న్హసా
దని వాణీశ్వరుఁ డాగమోక్తముగ సూర్యాచంద్రతార స్దావం
బునుభూమిన్నభము న్సృజించెను యథాపూర్వంబుగా నంతటన్.

305


క.

అనఘుండగు సత్యవ్రతు, మనుపట్టము గట్టె శౌరి మన్ననఁ జతురా
ననుఁ డాతఁడె వైవస్వతుఁ, డను పేరంగలిగి యిప్పు డలరె న్మిగులన్.

306


మ.

మనుజాధీశ్వర యిందిరారమణు శ్రీమత్స్యావతారంబు భ
క్తిని విన్నట్టి కృతార్థు లుత్తమరమాదీర్ఘాయురారోగ్యము
ల్గని సత్యవ్రతసార్వభౌమునిగతిం గల్పాంతరస్థాయికీ
ర్తిని జెన్నొందుదు రజ్జనాభుకరుణాదృష్ట్యైకపాత్రంబు లై.

307


క.

అని శ్రీవైశంపాయన, మునిముఖ్యుఁడు దెల్ప విని ప్రమోదాన్వితుఁ డై
జనమేజయుఁ డవ్వలికథ, యనఘా వినవలతుఁ దెలుపు మని యడుగుటయున్.

308


మ.

తనయాగ్రేసర రామదాసవిలసత్సాహిత్య హృష్యన్మనో
వనజాశంకరదాస గానకలనా వైయాత్యవీణానువా

  1. మీఱవైచినన్