పుట:Dashavathara-Charitramu.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

ఉపసృష్టి క్రమమెల్ల నొప్పించి బహుమానమంది వచ్చిన కర్దమాదిఋషుల
జనులకర్మశరీరసంఖ్య లెల్ల దినాంతకము వేసి లిఖియించు కరణికులను
దమతమయాధిపత్యములు దీర హజారమందుఁ గాపున్న యింద్రాదిసురుల
వినికి వేళ యటంచు వీణలతంత్రులు సారించుతుంబురునారదులను


తే.

దానవరుసల పెంచు గంధర్వగాయ, కులను జతగూడునట్టువకొలమువారిఁ
గాసెగట్టు వియచ్చరకంబుకంధ, రలను జూచుచుఁ గక్ష్యాంతరములు గడచి.

265


సీ.

తోరంపుసాంబ్రాణిధూపధూమము గట్టు పగదాయబాబాలబారు దీర్ప
బంధురమురజధింధింధిమిధ్వానంబు బహుళగర్జావిజృంభణము నెఱప
వేలుపుమిన్నల వివిధభూషణకాంతి శక్రచాపస్ఫూర్తి సవదరింపఁ
దిరుపులగట్టు బిత్తరులమైఁదీఁగెలు గ్రొక్కారుమెఱుఁగులకోపుఁ జూపఁ


తే.

బుష్పవర్షంబు వడగండ్లపొలుపు దెలుప, సారమృదుగీతికామృతాసార మెసఁగ
వర్షవేళను బోలు నవ్వనజభవుని, నాట్యశాలను దడసె దానవవిభుండు.

266


ఆ.

అజుఁడు గొలువుదీరి యంతిపురంబున, కరుగుదనుక నొక్కయరుఁగుగప్పు
రాలత్రోవఁ గానరాకుండ డాఁగి యా, వెనుక మెల్లన వలఁజనుచు నెదుట.

267


తే.

భానుపరిపూర్ణనీహారభానుచిత్ర, భానుభానుమహోజనిస్థానదృశ్య
మానమాణిక్యదేదీప్యమాన మైన, కాళికాగేహపాళి వీక్షించికొనుచు.

268


సీ.

శారికాకలకంఠసగుణనిర్గుణవాదనిర్ణయప్రవణవాణీశుకంబు
రథవియోజితమనోరథమనోజ్ఞవిహారహారివాహనరాజహంసకులము
నశ్రాంతవికచహేమాంభోజవిహరమాణాజ్ఞాతవిరహిరథాంగయుగము
భారతీగళరవాభ్యసనలీలాలోలకవకివకలరవకలరవంబు


తే.

గురుకుచాహాసపుషితచకోరకంబు, గానవిద్రవమాణశృంగారసౌధ
చంద్ర తాంబుకణపాయిచాతకంబు, నగుచుఁ జెల్వొందు కేలీగృహంబునందు.

269


మ.

తళుకుంజప్పరకోళ్లమంచమున నిద్దాజాజిపూసెజ్జపైఁ
బలుకుంజిల్కలకొల్కి రాచిలుక బాబాసాహిబూనెయ్యపుం
గలనన్ సౌఖ్యము గాంచి మైబడలఁగా గాటంపునిట్టూరుపు
ల్వొలయ న్నిద్రితుఁడైన పద్మభవు నాలోకించి యాలోపలన్.

270


తే.

అతులమాణిక్యదీపము లార్పరామిఁ, దనదు నెమ్మేనిచాయ నత్తఱి శయించి
యున్నయుడిగెపుపూఁబోండ్లయొడలిమీఁదఁ, బాఱనియ్యక యొకయోరఁ జేరవచ్చి.

271