పుట:Dashavathara-Charitramu.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


జీవోత్పన్నుఁ డెఱుంగకుండ నిగమస్తేయంబు గావించి వాఁ
డేవంక న్వసియించెఁ దెల్పఁగదవే యేతత్పురావృత్తమున్.

228


క.

అన వైశంపాయనముని, విన విన నిం పొంద నిట్లు వినిపించె ఘనా
ఘనఘనరవగౌరణలం, ఘనజాంఘికనవరసార్థగంభీరోక్తిన్.

229


క.

మును చాక్షుషమన్వంతర, మునను హయగ్రీవనామమునఁ దగుదనునం
దనుఁ డతిఘోరతపశ్చ, ర్యను హరు సంతుష్టుఁ జేసి యాహరుకరుణన్.

230


క.

వనరాశి భువనమోహన, మను నగరం బొకటి దానవాధ్యక్షత్వం
బును నిర్జరవరజిత్వర, ఘనబాహుబలంబుఁ గాంచి కదనోన్ముఖుఁ డై.

231


క.

రుషితుఁడుగా గిరి గుహలం, దుషితత్త్వము గన్నసురల కుచితంబయ్యె
న్దుషితత్వము పరు విడు నని, మిషపతియు మనోజవాఖ్య మించవహించెన్.

232


వ.

ఇట్లు దురతిక్రమనిర్వక్రదోర్విక్రమంబున శక్రాది సకలలోకపాలకులంబు
వికలంబు గావించి తదీయపదంబు లాక్రమించి వారలు దనపదంబు లాశ్రయింప
భువనత్రయం బేకాతపత్రంబుగాఁ బాలించుచుండి యొక్కనాఁడు.

233


చ.

హరిహయవహ్నిసౌరిదనుజాప్పతి వాయు కుబేర శంకరుల్
సరసత గొల్వుమ్రొక్కు లిడ స్వామి పరా కవధారు దేవ హె
చ్చరిక యటంచుఁ గంచుకులు సారెకు నూరెల నుగ్గడింపఁగా
నురుమణిపీఠి నిండుకొలువుండి నిశాచరనాథుఁ డిట్లనున్.

234


క.

ధీరహితులఁ దనమంత్రులఁ, జేరంగాఁ బిలిచి యతివిజృంభితవర్షా
ప్రారంభాంభోధరగం, భీరవచోగుంభనంబు మించ వచించెన్.

235


తే.

అఖిలదిక్పాలకాధిపత్యంబు మనకుఁ, జెల్లుచుండఁగ నిది యేమి క్షితిదివిజులు
యాగభాగంబు లర్పింప రంచు నొకని, శాచరునిఁ బంప వాఁడు యాజకులకడకు.

236


క.

చని “యింద్రాయస్వాహ”, యనుచుఁ బురోడాశ మిచ్చు నవసరమున హో
తను జెయివట్టి యహో నిలు, మని గద్దించుచును బలికె నందఱు వినఁగన్.

237


శా.

సౌవర్ణాచలధైర్యకల్పితతపశ్చర్యాసహర్షీభవ
జ్జీవంజీవసుహృత్కళాధరవరశ్రీదర్పభీతామనా
క్సేవాసాంజలితానమద్ధరిహయగ్రీవుం డనాఁగా హయ
గ్రీవుం డేలెడు ముజ్జగంబులు గనత్కీర్తిప్రతాపంబులన్.

238


సీ.

జేజే యనుచు మ్రొక్కు జేజేలరాయఁడు వేఁడికోనని చూచు వేఁడివేల్పు
దండంబు ధరియించు దండపాణి తదాజ్ఞ దా నవుదలఁ దాల్చు దానవుండు
చేతులు మొగించి ప్రచేతుండు భజియించు గతి నీవె యని సదాగతి చరించు
ధర్మువంచు మనుష్యధర్ముఁడు ప్రార్థించు శంకచే శరణొందు శంకరుండు


తే.

జలధి సొరబారు హరియును జడధి యగుచు, గట్టుమెట్టును బులితోలు గట్టుదంట
దెసలదొరలకె యిటువంటిదెసలు దొరలఁ, గలరె పరు లింక నతనితోఁ గలని కెదుర.

239