Jump to content

పుట:Dashavathara-Charitramu.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

మునుపటిభవమున నేఁజే, సినపుణ్యమువలన మిమ్ము సేవింపఁగఁ గం
టిని మాయలేటి కింకిట, వినిపింపఁ గదయ్య నీదు వృత్తాంతంబున్.

167


మ.

అనినం గైతవమత్స్యమూర్తి [1]కరుణాయత్తైకచిత్తంబు మీ
ఱ నను న్భూవర యాత్మతత్వము పరబ్రహ్మంబుగా నెమ్మనం
బునఁ జింతింపుము సంశయింప కిఁకనేమో యంచు నీచర్య కే
ననుమోదించి యనుగ్రహించితి నభీష్టార్థంబు నీ కయ్యెడున్.

168


సీ.

వినుము సత్యవ్రత వినయగుణాన్విత భావికార్యము తేఁటపఱుతు నీవు
కనుఁగొనుచుండు మింకను నేఁడు మొదలుగా నేడుదినంబుల కిప్పయోధి
భువనముల్ త్రిభువనంబులను లోఁ గొను నేలనన్న నానాఁటికి నబ్జభవుని
రేయైన నతఁడు నిద్రించుఁ గావున దాని కెడఁద భయంపడ కెనయ నప్పు


తే.

డోషధీబీజరాసుల యోడ నీకు, పంపుచున్నాఁడ నోడక యందుసప్త
ఋషులతోఁ గూడి వసియింపు మెపుడు నాదు, భక్తజనమున కెందు నాపదలు లేవు.

169


తే.

అనుచు నానతి యిచ్చి మాయావిసార, మూర్తి యంతర్హితుండైన మ్రొక్కి నృపతి
యెంత దయగలవాఁడు సర్వేశ్వరుండొ, హో యటంచును నిష్టతో నుండు నంత.

170


సీ.

ప్రథితసుమేధుఁడై పరగుసుమేధుండు విరజుఁడై శాంతిచే వెలయు విరజుఁ
డాభాహవిష్మంతుఁ డగుహవిష్మంతుండు నుత్తము డైనట్టి యుత్తముండు
వనజాక్షపదభక్తవనమధుండగు మధుం డఘపారదమహాగ్ని యైనయగ్ని
ద్వంద్వసహిష్ణుఁడై తగిన సహిష్ణుండు ననఁదగు సప్తర్షు లమితహర్షు


తే.

లగుచు వచ్చిరి లవణమహాంబురాశి, వేల దర్భశయానుఁడై విభుఖగేశ
యాను నతివేలభక్తిభాగనఘజనకృ, పాలు హరిఁ గొల్చు ద్రవిడనృపాలుకడకు.

171


ఆ.

అట్టు లరుగుదెంచి నట్టియయ్యతులకు, నతులగతుల మతులు నతులు చేసి
యతివినీతి, నున్న క్షితితలపతిధృతి, మతిని మెచ్చికొనుచు మౌను లనిరి.

172


క.

శతవర్షంబుల నుండియు, క్షితి వర్షము లేని కతన శిథిలంబగు చో
నతివృష్టి మించె జలనిధి, గతి దృష్టించితివె ముజ్జగంబులు ముంచున్.

173


తే.

ఇందు నెవ్వరిఁ గనుఁగొన మిజ్జగంబు, నందు నాశ్చర్యమయ్యెనో యవనినాథ
యేకతంబున వారాశి సైకతమున, నేకతంబున నున్నాఁడ వెఱుఁగఁ జెపుమ.

174


ఉ.

నావిని తావినీతి జననాయకుఁ డిట్లను మౌనులార రా
జీవమొకండు మొన్న ననుఁ జిత్రము గా బ్రమియించి యంతటన్
భావికథ ల్సవిస్తరతఁ బల్కి పయోధి మునుంగకుండ నే
నావఘటింతు నీకు మునినాథులతో వసియింపు మత్తరిన్.

175
  1. కరుణైకాయత్తచిత్తంబు