పుట:Dashavathara-Charitramu.pdf/314

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నీకప్రోల్లసమై సమైలబిలవాణిజ్యార్యశూద్రార్జితా
స్తోకార్ధాధికమైకమై జనుల కెందున్ జెల్వమౌ ద్వారకన్.

253


తే.

అప్పురి కుశస్థలి యనంగ నొప్పు మున్ను, ద్వారవతినాఁగ రహి మీఱు ద్వాపరమున
దానిసౌభాగ్య మెన్న నెవ్వాని శక్య, మల్లవైకుంఠమే తప్పదది నరేంద్ర.

254


ఉ.

యాదవవృష్ణిభోజకుకురాంధకసాత్వతు లాదశార్హు లా
మోదదశార్హులై కొలువ ముఖ్యసుధర్మసభానివిష్టుఁడై
శ్రీదయితుండు రంజిలె నశేషసురాశ్రితపార్శ్వభాగుఁడౌ
నాదివిజాధినాయకునియందమునన్ భువనంబుఁ బ్రోచుచున్.

255


సీ.

మును రుక్మిణిని విన్న యనురాగ మంతరంగావాలతలమున నంకురించె
వెనుక విప్రుడువచ్చి విచ్చేయు మనిపిల్వఁ గొమరుమీఱఁగ ననల్కొనలు సాగెఁ
గుండిననగరంబు దండ నిల్చినవేళ మేలుగీలుకొనంగఁ బూలు బూచె
శైలకన్యానివాసంబు వెల్వడఁబోఁగఁ గనుఁగొనగా దోరకాయలయ్యె


తే.

నెత్తి రథమున నిడ ఫలియించె నన్య, రాజలోకంబు గెల్చి ద్వారకకు వచ్చి
ప్రేమఁగల్యాణ మై రతిక్రీడఁ దనియ, వనజనాభున కనుభవంబునకు వచ్చె.

256


మ.

మొదలం దొంగగు నేమి యాడఁ జను సొమ్ము ల్వానిపైఁ బెట్టి ప
ల్కుదు రెవ్వారిలలో "గతానుగతికో లోకో" యనన్ సత్యమౌ
నదిరా మున్నవనీతచోరుఁడని కాదా భక్తినిశ్రేయస
ప్రదుఁ గృష్ణు న్మణిచోరుఁ డంచనియె సత్రాజిత్తు విత్రాసియై.

257


చ.

వసుమతి నెంతవారలకు వచ్చు నొకానొకనింద వచ్చుచో
నసురవిఘాతిరీతిఁ బరిహారము సేయ నొకండు నేర్చునే
బిసబిస నేఁగి జాంబవతిఁ బెండిలియై మణిఁ దెచ్చి యిచ్చి యిం
పెసఁగఁగ సత్యభామ వరియించె వినిందకుఁ డార్తి గుందగన్.

258


మ.

అఁటఁ గాళిందిని మిత్రవిందను సుదంతాబ్దాక్షి భద్రామహీ
కటినిన్ లక్షణ బెండ్లియై నరకునిన్ ఖండించి వానింటఁ జొ
క్కటమై మించు పదాఱువేల మహిరాట్కన్యావతంసంబులన్
ఘటియించెం దనకుం గులాంగనలుగాఁ గల్యాణలీలాగతిన్.

259


సీ.

కలహాంతరిత భోజకన్యను లాలించు స్వాధీనపతిక సత్యను భజించు
వాసకసజ్జిక యౌసుదంతను గూడు విప్రలబ్ధను మిత్రవింద నరయు
ఖండితయైన లక్షణ వేఁడికొను విరహోత్కంఠితను భద్ర నూఱడించుఁ
గాళింది నభిసారికను జేరి కలయుఁ ప్రోషితభర్తృకను జాంబవతినిఁ జేరుఁ


తే.

గడమ పదియాఱువేవురుకంజముఖుల, భావహావవిలాసవిభ్రమవిహార
లలితబిబ్బోకచకితలీలాదరస్మి, తాదిశృంగారచేష్టల కలరు శౌరి.

260