పుట:Dashavathara-Charitramu.pdf/310

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

అనుటయుఁ గుబ్జానామం, బునకుంబనిలేదు స్వామిపుణ్యంబునఁ జ
క్కనిదయ్యె నియ్యడను నే, ననరా దీవాడఁ గలరె యాపాటిచెలుల్.

219


తే.

అనిన నీకేల సంకోచ మంబుజాక్షి, కంతుసింగాణిమువ్వంక గాదె మెఱుపు
పలుదెఱంగుల మెఱయదే పద్మముఖికి, మునుపు కొదవేమి యనుచు నమ్ముదితఁ గనుచు.

220


సీ.

నీరజాననముద్దునెమ్మోముచెలువంబు గనుఁగొన్నఁ బద్మిని యనుచుఁ దోఁచె
కంబుకంధరకంఠకంబుసౌందర్యంబు గనుఁగొన్న శంఖిని యనుచుఁ దోఁచె
హస్తీంద్రనిభయాన యానశృంగారంబు గనుఁగొన్న హస్తిని యనుచుఁ దోఁచె
నీమనస్వినికి నాపై మది గల్గుట గనుఁగొన్నఁ జిత్తిని యనుచుఁ దోఁచె


తే.

జాతి యెయ్యది యొక్కొ యీనాతి కనిన, మాధవున కేల జాతిసంబంధ మనుచు
నుద్ధవుఁడు వల్క నవ్వుచు నుద్ధవమున, నద్ధవుఁడు సేరఁగావచ్చునవసరమున.

221


చ.

పొదిగిట నిల్చిచూచు విరిఁబోడి ముదం బెదఁ బిక్కటిల్లఁగా
నెదురుగ వచ్చి తోన చెలులిచ్చిన కమ్మనితావినీటఁ ద
త్పదజలజాతము ల్గడగి పయ్యెదచేఁ దడియొత్తి యింపుసొం
పొదవగఁ గేలొసంగి వినయోక్తులఁ దేనియ లొల్కఁ బల్కుచున్.

222


సీ.

గోపికారమణులఁ గూడుక క్రీడించు శ్రీకృష్ణు వ్రాసినచిత్తరువులు
సకినెలతలగడ ల్చప్పుడైనను దోన కివకివల్గొణుగుపారువపుజోళ్లు
కమ్మక్రొవ్విరిమేలుకట్లకుఁ దేఁటులై తిలకించు సాంబ్రాణిధూపములును
బదివన్నె దివ్వెకంబమున మాణిక్యంబు లీల నెంతయుఁ బ్రజ్వలించుదివ్వె


తే.

గలిగి విలసిల్లు కేళికాగారమునను, జాళువాకోళ్ళపట్టెమంచంబునందు
ధవుని వసియింపఁ బంచి యుద్ధవునిజెంతఁ, బసిఁడిగద్దియ నుండె నప్పద్మగంధి.

223


తే.

వక్కలాకులు విరు లొక్క వరుససొమ్ము, ఱవికెపావడ జంట చెఱంగుచీర
యుద్ధవుఁ డొసంగ వింత సేయుదురె యంచుఁ, జెలువజనని ప్రియోక్తులు పలుకుచుండ.

224


తే.

సదనమున కేఁగి పన్నీట జలకమాడి, హరువు మీఱంగఁ గైసేసి యారగించి
లలితమన్మథసామ్రాజ్యలక్ష్మి పోలి, వచ్చి నిలుచున్న చెలిచెలువంబుఁ గాంచి.

225


సీ.

శశిసహస్రకళాప్రసన్నుఁడై యుండెనా చెలిమోముతో సాటి చేయవచ్చు
జలజపత్రములు చేరల కెక్కుడుండెనా పొలఁతికన్నుల సరిఁబోల్పవచ్చుఁ
బదియేడువన్నెలబంగారు గల్గెనా కలికిమేనికిఁ బ్రతిఁ బలుకవచ్చుఁ
గనకాద్రి కింక నొక్కటి జోడు గల్గెనా వనితగుబ్బల కెన యనఁగవచ్చు