పుట:Dashavathara-Charitramu.pdf/308

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మ.

కలకంఠు ల్వలిగుబ్బజంట నెలవంక ల్వేఁడ నేమేనియుం
బలుకన్నేరక రాధ నీళ్లు నమలున్ బంతిన్ యశోదాంగనా
తిలకం బేమిటి మాట తాఁకినవి యింతే కేతకీకంటకం
బులు బొమ్మం చదలింప నట్లయను నప్పూఁబోణి లేనవ్వునన్.

202


క.

ఆనాఁటి వినోదము లె, న్నైనం గలవైన నెన్న నాకలుగునొకో
యానారీపరిరంభం, బేనాఁటికినైన వచ్చు నిదె హరి యనుమీ.

203


క.

అని పంప నుద్ధవుఁడు చని, వనితలతో మాటలాడి వచ్చి లతాంగు
ల్వినిపింపుమనినమాటలు, తనతోఁ దెల్పిన మురారి దరహాసమునన్.

204


ఉ.

ఏమనిరోయి యుద్ధవ మృగేక్షణ లామధురాపురంబులోఁ
బ్రేమను వన్నె వెట్టి వలపింపఁగ నాయకురాండ్రు గల్గ మా
మోములఁ జూచునే యిఁకను ముచ్చటగా నని బలాబలా
యేమిటిమాట నామనసొకింత యెఱుంగరుగా వ్రజాంగనల్.

205


ఉ.

ఎప్పుడు వచ్చునంచుఁ తమి హెచ్చగ నొక్కెడఁ గాచియున్నచోఁ
గొప్పరవీడ గబ్బిచనుగుబ్బల పయ్యెద జాఱ సంభ్రమం
బుప్పతిలంగఁ జేర ముద మొప్పఁగ వచ్చియుఁ గౌఁగిలించుచో
నప్పటిసౌఖ్యమింత గలదా వెలబోటులయందు నెయ్యెడన్.

206


మ.

అనిన న్నవ్వుచు నుద్ధవుండు కమలాక్షా ముగ్ధజారాంగనా
జనసంగం బిది యెంత మన్మథకళాశాస్త్రైకపారీణలై
వినయోక్తు ల్ఘనరక్తులు న్వెలయఁగా వేయాఱుబంధంబులం
బెనఁగంజాలిన ప్రౌఢవారసతులం బేర్కొన్నచో నావుడున్.

207


మ.

ఐనం జూతమటంచు నున్నయెడ నబ్జాక్షానుకూలంబుగా
భానుం డస్తనగంబుఁ జేరఁజనుచోఁ బ్రాగద్రికూటంబునన్
శ్రీనాథప్రియకారియై పొడమె రాజీవారి తచ్చంద్రికా
శ్రీనైపుణ్యము మించెఁ జోరజనరాజీవారియై యయ్యెడన్.

208


సీ.

తళుకుసంపఁగిమొగ్గతాయెతు ల్మెఱయంగ నరవిరివిరజాజిసరులు చుట్టి
తీరుగాఁ గస్తూరితిలకంబు దీరిచి మేలిమిబురుసారుమాల గట్టి
మురువైన హురుమంజిమురువుతోఁ గట్టాణి ఘనమైనగొప్పచౌకట్లు దాల్చి
తావికుంకుమపుగంధముపట్టె యురమున రాణించు తారహారములు వైచి


తే.

వలిపెచెంగావిదుప్పటివల్లెవాటు, నేలజీరాడ గిలుకుపావాలు మెట్టి
చికిలుసానాకరంబునఁ జెలువు గులుక, నగధరుం డొంటిగాఁ దననగరు వెడలె.

209


తే.

వెంట నరుదెంచు నడప వాల్గంటిచేతి, యుదిరియడపంబు గైకొని యుద్ధవుండు
కెలసఁ జనుదేర పరిజనంబులను బనిచి, కమలనేత్రుఁడు నగరమార్గమునఁ జనుచు.

210