పుట:Dashavathara-Charitramu.pdf/282

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

వలదు బలభద్రుతో నేల కలహ మనుచు, బుద్ధికొలఁదిని సమవర్తిపుత్రముఖులు
దెలిపి వినకున్న నూరకె నిలిచి రంత, నురివి బలభీమసేను లొండొరులఁ దాఁకి.

159


ఉ.

అర్పుల నట్టహాసముల నబ్జభవాండము పిక్కటిల్లఁగా
దర్పము మీఱఁ బోరు మదదంతులపోల్కి యుగాంతలోకభి
ద్దర్పకవైరిరోషమున దారుణులై యరుణాయతాక్షులై
నేర్పులు మీఱఁ బోరి రతినిష్ఠురమైన గదారణంబునన్.

160


క.

తనశిష్యుండైనసుయో, ధను జంపెనటంచు మిగుల దారుణమగు కి
న్కను గొట్టె బలుఁడు భీముని, ననిలసుతుం డతని గురుఁ డటంచుం గొట్టెన్.

161


క.

బలుగదపెట్టున భీముఁడు, కులిశాహతిఁ గొండఁ బోలి గులగులలగు న
బ్బలుఁ డనిలజుగదపెట్టున, నలరు సరిన్ వింధ్యమట్టు లలుకఁడు కడిమిన్.

162


ఆ.

చేరి మూఁడునాల్గు చేతులు వెడలిన, యంతలోన వలసి యనిలసుతుఁడు
చెదరి యదరి చాల పెదవులు దడుపుచు, స్రుక్కి నాల్గుదెసలు చూడఁదొణఁగె.

163


క.

అప్పుడు విడువక వైసెం, గుప్పున నడునెత్తి పగులఁ గుదిగొని వెడలెం
గప్పెఱ నెత్తురు భీమున, కప్పాండవలోచనముల నశ్రులుతోడన్.

164


సీ.

కన్నీళ్లు వఱదలై కాఱఁగాఁ గుంతియు ద్రౌపతి యొకచోటఁ దల్లడిల్ల
మునుపు నేఁ జెప్పిన వినఁడాయెఁ గార్యంబు దప్పెనంచును ధర్మతనయుఁ డడలఁ
జూచి యుపేక్ష చేసుక యున్న నాయమా కృష్ణా యటంచుఁ గిరీటి నుడువ
ధౌమ్యాదు లింతక్రోధం బేల శిష్యుపై నంచు నక్కడనుండి యభినుతింపఁ


తే.

గినిసి యెవ్వరు చెప్పిన వినక భీముఁ, జంపఁ గడఁగెడు యాదవసార్వభౌము
కేలు గదఁ గూడబట్టి శ్రీకృష్ణుఁ డప్పు, డేల వల దన్న కోపంబు చాలునన్న.

165


క.

హరివాక్యామృతధారం, బరుషరుషానామదావపావకుఁ డాఱం
గరుణించి విడిచె లాంగల, ధరుఁ డనిలకుమారుఁ బాండుతనయులు చెలఁగన్.

166


క.

కళవట్టిపడిన భీముఁడు, దెలిసెన్ హరికరుణ నంత దేవుఁడ నిన్నుం
దెలియక పోరితి నేరము, గలదనఁగా భీము సీరి గౌఁగిటఁ జేర్చెన్.

167


ఉ.

పుణ్యము శౌనకాదిమునిపుంజశరణ్యము నైన నైమిశా
రణ్యమునందు నొక్కమఖరాజ మొనర్చెను రేవతీసతీ
మణ్యభిరాముఁడై బలుఁ డమానుష వైభవముల్ జగత్త్రయీ
గణ్యములై తనర్ప జనకామితము ల్దయసేయఁజాలుచున్.

168


తే.

సాంగదక్షిణ లొసఁగి యజ్ఞంబు చేసి, యవభృథస్నాన మొనరించె నతివఁ గూడి
సకలబంధుజనములతో సంభ్రమమునఁ, గలుషతిమిరహరుండు లాంగలధరుండు.

169


సీ.

ధగధగద్ధగితరత్నకిరీట కాంతులు పదివేల సూర్యబింబములు దెలుప
దళధళద్వజ్రకుండలకాంతిమండలి గండమండలమున మెండుకొనఁగఁ