పుట:Dashavathara-Charitramu.pdf/281

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దర్శించి కృతమజ్జనాగోదావరీతి వెలయు గోదావరీతీరంబు చేరి కృతఫ్లావనుండై
వినతశ్రీశైలబిలహితాధిష్ఠితం బగు శ్రీశైలంబు దర్శించి వేంకటాచలంబున కరిగి.

151


సీ.

జాతికిరీటిపచ్చలకిరీటము డాలు ఖంజరీటంబుల పుంజి దెలుప
మకరకుండలమరీచికగండమండలి మండలీనాట్యసంభ్రమముఁ జూప
గరశంఖచక్రము ల్వరచక్రతిమిరవారణచక్రరిపుహితప్రౌఢి మెఱయ
రమణీయపీతాంబరప్రభాడంబర మంబరంబునకు హేమంబు నెఱప


తే.

వక్షమునఁ గౌస్తుభంబు శ్రీవత్సతులసి, దామముల కాంతియును సముద్దామలీలఁ
గలసి కుంకుమకస్తూరికల ఘటింప, మెరసి కొలువుండు వేంకటేశ్వరునిఁ గాంచి.

152


సీ.

సదయవీక్షాచకచ్చకలవీక్షావని గనుపట్టు వీరరాఘవునిఁ గొలిచి
క్ష్మాకాంచి యనమించు కాంచీపురంబులో విలసిల్లు వరదరాజుల భజించి
యుభయకావేరీమహోజ్జ్వలాశ్రీరంగధాముని శ్రీరంగధాముఁ బొగడి
దక్షిణద్వారకాస్థలరాజమునను గృపాళుఁడౌ రాజగోపాలుఁ జూచి


తే.

దర్శనంబున బ్రహ్మహత్యానువర్ణ, మోషణాదిమహాదోషములు దొలంగఁ
జేయుటకు హేతువౌ రామసేతువునను, మునిఁగి రామేశ్వరునిపదములకు మ్రొక్కి.

153


తే.

ముత్యములు పండునదిలోన మునిఁగి మంచి,గందపుంగొండయందు నగస్త్యమౌని
భర్గు సేవించి కన్యాఖ్య దుర్గ గాంచి, భక్తి గోకర్ణనాథునిఁ బ్రణుతి సేసి.

154


తే.

అంత మాహిష్మతీపురి కరుగుదెంచి, భక్తి మను తీర్థమాడి ప్రభాసమార్గ
మునను సీరి కురుక్షేత్రమునను గాంచె, యోధమానుల భీమదుర్యోధనులను.

155


క.

కాంచి దయ న్వలదని వా, రించుచు వినకున్న శ్రీహరిప్రహితుండై
కాంచనమణిమయభవన, ప్రాంచితమగు ద్వారకాపురంబున కరిగెన్.

156


సీ.

బలదేవుఁ డొకనాఁడు పద్మాక్షుతోఁగూడ ధర్మనందను సభాస్థలికి వచ్చి
యిష్టగోష్ఠిని వసియింప నారదమౌని యరుదెంచి సత్కృతుఁడై వసించి
బకుని హిడింబుఁ గీచకుని జరాసంధు రారాజు గెల్చి విక్రమము మెఱసె
ఘనుఁడు గదాయుద్ధమునను భీముఁడు బలదేవున కొరునకు దిగుడుగాని


తే.

యనిన నటులేల హలిసరి పెనఁగలేనె, యనిన భీముని గనుఁగొని కినుక వొడమి
సీరి గదదిక్కుఁ జూచినఁ జిత్తమటుల, నైన నాకోర్కె ఫలియించె ననుచు లేచి.

157


క.

భీముఁడు గదఁ గైకొనినన్, రాముఁడు గదఁ బూనెఁ గ్రోధరక్తాక్షుండై
యామేటిమగలఁ గనుగొని, భూమీశులు మిగుల వెరఁగుఁ బొందుచుఁ దమలోన్.

158


సీ.

కలహాశి యిప్పు డెక్కడనుండి వచ్చె నీయన్యోన్యరణమున కనియె నొకఁడు
గురుఁడు గాఁడే సీరధరుఁ డధికుండన్నఁ దనకేల యీరోస మనియె నొకఁడు
ఇతనిశిష్యుఁడు కురుపతి గెల్వఁడే సీరికిని సరిపోరఁడా యనియె నొకఁడు
నది యేటిమాట తాలాంకులోపల సహస్రాంశంబుఁ బోలలేఁ డనియె నొకఁడు