పుట:Dashavathara-Charitramu.pdf/263

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

ఈరామాయణకథ యె, వ్వారు పఠించినను వినిన వ్రాసిన సౌభా
గ్యారోగ్యభాగ్యయుతులై, వారలు వెలయుదురు సుమతి వసుమతిలోనన్.

202


క.

అని శ్రీవైశంపాయన, మునిముఖ్యుఁడు దెలుప విని ప్రమోదాన్వితుఁడై
జనమేజయుఁ డవ్వలికథ, యనఘా వినవలతుఁ దెలుపు మని యడుగుటయున్.

203


శా.

శ్రీరాగోజ్జ్వలగేహ తోయజదళాక్షీమోహనాదానవ
త్సారంగప్రవరాళిపార్శ్వనినదద్ఘంటీరవప్రాంగణా
సౌరాష్ట్ర ప్రియశంకరాభరణరాజత్ప్రజ్ఞకేదారకా
శ్రీరామేశ్వరధీరమధ్యలలిత శ్రీదాభిరామక్రియా.

204


క.

పూర్వోత్తరమీమాంసా, పూర్వోత్తరవినుతసమరభూసాహసితా
పూర్వోత్తరసారథిరథి,పూర్వోత్తరరాజమిత్ర భూరిధనాఢ్యా.

205


స్రగ్విణీ.

చంద్రకాంతోన్నమత్సౌధయూథక్రమా
చంద్రకాంతోపలాంచద్యశశ్చక్రమా
చంద్రకాంతోపమానన్ముఖాబ్జక్రమా
చంద్రకాంతోత్తమాశ్వస్ఫురద్విక్రమా.

206


గద్య.

ఇది శ్రీరామభద్రదయాభిరామభద్రకరుణాకటాక్షవీక్షాపరిప్రాప్తదీప్తతరాష్ట
భాషాకవిత్వసామ్రాజ్యధౌరేయ సకలవిద్వత్కవిజనవిధేయ ధరణిదేవుల నాగ
నామాత్యసుధాసముద్రసమున్నిద్రపూర్ణిమాచంద్ర రామమంత్రీంద్రప్రణీతం
బైన దశావతారచరిత్రం బనుమహాప్రబంధంబునందు సప్తమాశ్వాసము.

7. శ్రీరామావతారకథ సమాప్తము.