పుట:Dashavathara-Charitramu.pdf/257

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మ.

హతశేషత్రిదశాహితుల్ బలవిపక్షారాతియాయోధన
క్షితిలోఁ గూలుటఁ దెల్ప మూర్ఛిలి దశగ్రీవుండు హాపుత్త్ర దై
వతలోకేంద్రుఁడు తన్నుఁబట్టుకొని పోవన్ వాని వారించి తె
చ్చితి నేఁ డేటికి నొప్పగించి చని తీశ్రీరాముబాణాగ్నికిన్.

155


మ.

అని శోకించి సరోషుఁడై జనకకన్యం జంపఁగాఁ బోయి మం
త్రినిరుద్ధుండయి పంపి మూలబలముం ద్రెళ్లన్ రఘూత్తంసుచే
తను దా వచ్చి యనేకకీశభటులం దండించి యత్యుగ్రశ
క్తిని సౌమిత్రిని నేయ నాతఁడు ధరిత్రిన్ వ్రాలె నిశ్చేష్టుఁడై.

156


చ.

అనుజునిఁ జూడ శోకము దశాననుఁ జూడఁగ వచ్చురోషముం
బెనఁగొన రామభూవిభుఁడు పేర్చి జ్వలద్విశిఖార్చి నేర్చగా
దనుజవిభుం డెదుర్చుటకుఁ దాళక యూడనిఁ బాడె ఖిన్నుఁడై
వనచరు లోదశాస్య యలవాటుగదా యిది నీకు నంచనన్.

157


సీ.

అంతట హనుమంతుఁ డౌషధు ల్గొనితేరఁ గదలుచు మునివేషుఁ గాలనేమిఁ
గని మున్ను గాన మిమ్మునినం చడిగి వాని జలము వేఁడిన వాఁడు గొలను జూపఁ
జని యచ్చటను మౌనిశాపంబు దీర్చి పొమ్మని పదంబులు పట్టుకొనినమకరి
మర్దింప నది ధాన్యమాలినియై కాలనేమిఁ దెల్పిన నైన నేమి యనుచు


తే.

వానిఁ బరిమార్చి ద్రోణపర్వతముఁ జేరి, యచట కాపున్న గంధర్వనిచయములను
గెలిచి తరిగట్టుఁగొని తెచ్చు పులుఁగుఱేని, సరణి మందులకొండ యంసమునఁ జేర్చి.

158


క.

తెచ్చిన యంతనె ప్రాణము, వచ్చె న్సౌమిత్రి కఖిలవానరబలము
న్మెచ్చెన్ రాఘవుశోకము, విచ్చెన్ రావణమనోరవిందము నొచ్చెన్.

159


సీ.

అసురేంద్రుఁ డంత శుక్రాదిష్టమగునియమమునఁ బాతాళహోమంబు సేయ
ననలుఁడు చెప్పి పంపెనొ నాఁగ ధూమంబు భీమమై వెడల విభీషణుండు
దెలిసి రాఘవులకుఁ దెలిపి తద్విఘ్నంబు గావింప సబలు నంగదునిఁ బంప
నతఁడు మందోదరీహరిణాక్షి వేణిఁ బట్టీడిచితెచ్చి దైత్యేంద్రుచెంత


తే.

నిలుప నాకంజవదన కన్నీరు దొరుగ, నాయకునిఁ జూచి వెస రోయఁబోయె వాఁడు
స్వక్సృపంబులు పడవైచి సురియఁ బూని, యంగదాదులఁ దఱిమి మహారయమున.

160


సీ.

దశమస్తకాధగద్ధగితరత్నకిరీటకాంతి భాస్కరుఁ గచాకచికిఁ గవయ
భుజచతుఃపంచకాద్భుతసాధనశ్రేణి భుజగజిహ్వాభుజాభుజకి మొనయ
జాజ్వల్యమానవింశతిదంష్ట్రి మర్త్యహర్యక్షదంష్ట్రారదారదికి నెదుర
దీప్తరోషజ్వలద్విదశకాలోకము ల్శిఖశిఖావళి ముఖాముఖికి డాయ


తే.

వెడలె సంగ్రామమునకుఁ బృథ్వీధరేంద్ర, సహజగౌరవవైభవాసహశతాంగ
పటపటాత్కారపటలలంపటపటాగ్ర, గళితదశకంధరుఁడు దశకంధరుండు.

161