పుట:Dashavathara-Charitramu.pdf/256

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

కుంభుఁడు సంస్ఫాలితభుజ, కుంభుఁడు పురి వెడలె మఱి నికుంభునితోఁ ద
త్కుంభచ్ఛదకు దివాకర, సంభవదోర్దండ మపుడు చండం బయ్యెన్.

144


తే.

తోడఁబుట్టిన కుంభునిఁ జాడనేఁగె, నల నికుంభుండు నంతట ననిలసుతుని
చేత నంపించుకొని మైందుచేత శోణి, తాక్షుఁడు ద్వివిదుచేత యూపాక్షుఁ డరిగె.

145


క.

మకరాలయబంధనరా, మకరాళశరాస్త్రశస్త్రమహిమ రుషోద్దా
మకరాక్షుఁ డగుచుఁ గూలెన్, మకరాక్షుఁడు దనుజసేన మల్లడిగొనఁగన్.

146


వ.

అంత.

147


ఉ.

జంభవిదారి వైరికృతసంగరుఁడై రఘువీరరోషసం
రంభముఁ జూచి నిల్వక పరాజితుఁడై కుహనామహీసుతా
లంభమున న్మరుత్సుతుఁ దొలంగఁగఁ జేసి యఁట న్నికుంభిలా
కుంభిని దీక్షఁ గైకొనుచు గొబ్బున హోమము సేయుచున్నెడన్.

148


మ.

హనుమంతుం డట పోయి యశ్రువులతో హారామ హారామ యం
చును శోకింపఁగ సీతఁ జంపి చనె నచ్చో నింద్రజిత్తుం డటం
చును దెల్పన్ విని హావిదేహసుత యంచున్ మూర్ఛిలెన్ రాఘవుం
డు నివారించెఁ దదీయమూర్ఛ ననుజుండున్ యత్నపూర్వంబుగన్.

149


ఉ.

అక్కట నేఁడు నీదగుననర్థము దెల్పెను నిట్టులైన నే
నెక్కడఁ జొచ్చువాఁడ నిఁక నెవ్వరిఁ జంపిన నేమి యంచుఁ దా
వెక్కుచు లక్ష్మణుండు పలవింపఁగ రాముఁడు చేరి యాగతిం
జొక్కిపడన్ విభీషణుఁడు భూసుతమేలు వచించి యిట్లనున్.

150


చ.

ఇనకుల యాంజనేయు భ్రమయించి నికుంభిలహోమదీక్ష గై
కొనఁ జనె నింద్రజి త్తటకు గొబ్బున లక్ష్మణుఁ బంపుమన్న న
జ్జనపతి విస్మయంబున ససైన్యముగాఁ బనుప న్నికుంభిలా
వని కరుదేర లక్ష్మణుఁడు వాసవవైరియు ముక్తహోముఁడై.

151


మ.

కనకస్యందన మెక్కి బిట్టెగయ నుగ్రంపశ్యనేత్రాబ్జుఁడై
హనుమద్వాహన మెక్కి లక్ష్మణుఁడు దివ్యాస్త్రాలిచే వానిమా
య నివారించి శిరోధరంబుఁ దెగవ్రేయం గల్పకశ్రేణి బో
రున వర్షించెఁ బ్రసూనవర్షములు మెండయ్యెన్ సురస్తోత్రముల్.

152


వ.

అంత.

153


శా.

సౌమిత్రేయుఁడు శక్రజిజ్జయరమాచంచన్నఖశ్రేణికా
సామగ్రిం బిశునాశుగప్రణితనూసౌందర్యుఁడై మొక్కినన్
వైమాత్రేయునిఁ గౌగిలించుకొని ముద్వారాశి నోలాడె శ్రీ
రామక్షోణివిభుండు రావణు గతప్రాణుండుగా నెంచుచున్.

154