పుట:Dashavathara-Charitramu.pdf/255

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మ.

అలుకన్ రామనృపాలశేఖరుఁ డధిజ్యంబైన వింటన్ శరం
బులు సంధించి ధ్వజాశ్వసారథిరథంబు ల్గూల్చి మాణిక్యమౌ
ళులు నేలంబడనేసి యేటి కిఁకఁ జాలున్ వీటికిం బొమ్మనం
దలవీడం బరువెత్తె రావణుఁడు సేన ల్కేకిస ల్గొట్టఁగన్.

135


చ.

ఇటువలె లంకఁ జేరి దనుజేశ్వరుఁ డంతటఁ గుంభకర్ణుఁ బం
పుటయును వాఁడు నాకసము భూమియు నిండినకొండమెండునం
బటపటనార్చుచుం గపులఁ బట్టుక మ్రింగుచు వచ్చి భానుజ
త్రుటితసనాసకర్ణుఁడయి త్రుంగెఁ దుదన్ రఘువీరుతూపులన్.

136


తే.

నెనరు గల్గిన యన్నయ నిదురలేపి, పనుప వచ్చినకుంభకర్ణునకు దీర్ఘ
నిద్ర యొసఁగె రఘూత్తమనిశితమార్గ, ణంబు లవిపక్షపాతు లనంగరాదె.

137


తే.

అంత దేవాంతకుండు నరాంతకుండు, ద్రిశిరుఁ డతికాయుఁడును వింశతిభుజసుతులు
దగ మహాపార్శ్వుఁడును మహోదరుఁ డనంగ, వెలయు పినతండ్రులను గూడి వెడలి రపుడు.

138


సీ.

రంగదభంగశౌర్యమున నంగదుఁ డప్పు డంగదుం డయ్యె నరాంతకునకు
దేవాంతకుండును ద్రిశిరుఁ డంగదలైరి హనుమంతుచేతి మహాద్రులకును
భుజమహోదరవహ్నిపుత్రుచే భిన్నమహోదరుం డయ్యె మహోదరుండు
వృషభునివలన నివేశితయను మహాపార్శ్వుఁ డయ్యెను మహాపార్శ్వుఁ డొకట


తే.

సంగరము చేసి యతిఘోరసంగరమున, గపులఁ బెక్కండ్రఁ జంపి నాకపులు వొగడ
నంత నతికాయుఁ డతికాయుఁ డయ్యె లక్ష్మ, ణప్రయుక్తవిరించిబాణప్రహతిని.

139


ఉ.

అంతట నింద్రజిత్తు సమరాంగణహోమము చేసి నీతిహో
త్రాంతరసీమ వెల్వడు మహారథ మెక్కి పయోధరాధ్వసం
క్రాంతి చెలంగె వైధనశరంబున షష్ఠిసహస్రకోటివి
క్రాంతకపీంద్రలక్ష్మణుల రాఘవు మూర్ఛిలనేసి నవ్వుచున్.

140


చ.

గెలిచితి రామలక్ష్మణులఁ గీశులనంచు మహాట్టహాసము
ల్సలుపుచు నింద్రజిత్తు చనఁ జయ్యన బ్రహ్మనుతోపదిష్టుఁడై
మలయక వేగ నేగి హనుమంతుఁడు మందులగట్టుఁ దెచ్చి వా
రలరుజలెల్ల మాన్పె రఘురాముఁడు మెచ్చుచుఁ గౌఁగిలింపఁగన్.

141


వ.

అంత.

142


మ.

ఖలుఁ డారావణుఁ జేరియుండెనని యింకం దీనిఁ గైకోఁడు ని
ష్కలుషుండైన విభీషణుం డనుచు లంకన్ శుద్ధి గావింప ను
జ్జ్వలకీలనలముం దగిల్చెఁ గపిరాట్సైన్యంబు హాహారవా
కులదైత్యాళి తదంతరాఘమువలెన్ క్షోభించె నత్యుద్ధతిన్.

143