పుట:Dashavathara-Charitramu.pdf/250

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శా.

అన్నా యేగతి దాఁటివచ్చితివి నీ వంభోధి సేమంబుతో
నున్నారా రఘురామలక్ష్మణులు లంకోద్యానమద్వాసమున్
విన్నారా దశకంధరాధము రణోర్విం గూల్చుకార్యంబు దాఁ
గన్నారా వినిపింపు నీకు శుభమౌ గాకంచుఁ ద న్వేఁడినన్.

100


మ.

తనవృత్తంబును రామలక్ష్మణుల యందంబు న్వివస్వత్కుమా
రునిసఖ్యంబును దెల్పి భీమతరమౌ రూపంబునుం జూపి సీ
తను నమ్మించి [1]శిరోమణిం బడసి యోతల్లీ ముదంబుండుమీ
యనఘున్ రాముని దెత్తు నేనని తదీయాజ్ఞానుసారంబునన్.

101


తే.

వెడలి యవ్వనిలోపల వృక్షవితతి, విఱిచి కుప్పలు వేసె నవ్వీరవరుఁడు
లంక భస్మంబు సేయువేళకును గాష్ఠ, జాలమును గూడవేసిన చంద మొంద.

102


తే.

అంత వనపాలపంచసేనాధినాథ, సప్తమంత్రి సుతాక్షశిక్షాప్రవీణుఁ
డైన హనుమంతు నింద్రజిత్తును నెదిర్చి, బ్రహ్మశరపాశమునఁ గట్టి పట్టి తెచ్చి.

103


తే.

తండ్రిముందఱఁ బెట్టి యోదానవేంద్ర, కోఁతిఁ దెచ్చితి ననఁబోయి కొఱవి దెచ్చి
నాఁడ ననవుడు ముక్కులు నలఁచుకొనిరి, కొలువువారెల్ల నపుడు పక్కునను నగుచు.

104


క.

కరువలిసుతుఁ డిట్లనియెం, గొఱవి నగుదు నీపలాశకులము దహింపన్
సురవైరి సత్యవాణిని, సరస్వతి యనంగ వినమె సత్యం బనుచున్.

105


ఉ.

శ్రీరఘువీరచంద్రునకు సీత నొసంగి యభంగవైభవో
దారుఁడవై చెలంగుము దశానన యంచును బుద్ధి చెప్పినన్
మారుతితోఁక చూఁడుమనె మండుచు రావణుఁ డౌర సమ్మతిం
జేరి మదాంధచిత్తునకుఁ జెప్పఁగఁ బోయిన హాని వచ్చుఁగా.

106


ఉ.

శ్రీజనకేంద్రనందనకుఁ జిత్తము రంజిలఁ గంజరాగవి
భ్రాజితకీలకాభినవపంకజపూజ లొనర్చి కేళికా
రాజితవాలకీలి నలరావణు లంకఁ దగుల్పఁజేసె నీ
రాజస మెంత భక్తుఁడవురా హనుమంతుఁడు క్షోణిపుత్త్రికిన్.

107


మ.

దనుజాధీశపురంబుఁ గాల్చి మహిజాతం గాంచి వాలాగ్ని వా
ర్ధిని జల్లార్చి కపీంద్రులం గలసి యెంతేవేగ నేతెంచి నేఁ
గనుఁగొంటిన్ రఘువీర జానకిని లంకాపట్టణాభ్యంతరం
బున నంచున్ హనుమంతుఁ డిచ్చె ధరణీపుత్త్రీశిరోరత్నమున్.

108


క.

ఇచ్చినఁ గైకొని మారుతి, మెచ్చినఁ గౌఁగిటను గ్రుచ్చి మిహిరకులీనుం
డచ్చెరువగుబలములతో, వచ్చె న్వారాశితీరవనిఁ జేరంగన్.

109


క.

శరణాగతు దశకంధర, శరణాగతుఁ డనక యనఘసద్గుణమణిసం
భరణు విభీషణుఁ గరుణా, భరణుం జేపట్టె రామభద్రుఁడు ప్రేమన్.

110
  1. శిరోమణిం గొనిప్ర మోదం బందుమీతల్లియ త్వనఘున్