పుట:Dashavathara-Charitramu.pdf/249

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

నాశరస్ఫూర్తి నారీతి నతిశయిల్ల, నింక నీదుశరస్ఫూర్తి హెచ్చఁజేయ
కేల కురియించె దీపస్రవృష్టి వైరి, బలములఁ దదీయవనితలఁ గలుగఁజేయు.

90


మ.

అని సౌమిత్రి తదాజ్ఞఁ దోడుకొనిరా నంభోజినీబంధునం
దనుఁ డేతెంచె వలీముఖప్రముఖనానాసింహనాదార్భటీ
జనితప్రత్యురుశబ్దసూచితభవిష్యద్ధక్షిణాంభోధిబం
ధనవేళోద్ధరణక్రియాకులసమస్తక్ష్మాధరాక్రోశుఁ డై.

91


క.

ఏతెంచి నాల్గుదిక్కుల, సీతాసతి వెదకఁ బ్లవగసేనఁ బనుపుచో
సీతాపతి హనుమంతుని, చేతికి ముద్రిక యొసంగి శీఘ్రం బనుపన్.

92


మ.

అతఁ డుప్పొంగుచు నంగదాదిపిసారంగాచ్ఛభల్లేంద్రసం
గతుఁడై దక్షిణదిక్కునం జనుచు రంగత్పక్షసంపాతసం
వృతసంపాతిఖగోక్తమార్గమున నుర్వీకన్యకాలోకనో
ద్ధతుఁడై యెక్కె మహేంద్రశైలము మరున్మార్గస్పృహత్సాలమున్.

93


సీ.

నిలిచి యంఘ్రులఁ దన్ని నిగుడుచో గిరి ఘటోద్భవపదన్యాసవింధ్యాద్రిఁ బోల
గట్టినాళపుటుంటపిట్టకైవడి యురోఘట్టన ఱెక్కలగట్టుగూల
సురసార్థకృతమహత్తరసూక్ష్మతరరూపములను హరిత్వంబు విలసితముఁగ
నంజనాసంతతి యందు సింహిక నొంచు టని నిలింపులగుంపు లభినుతింప


తే.

రాముచే దైత్యుఁ డీల్గు కార్యంబు దెత్తు, విశ్వసింపుడు నామాట వేల్పులార
యనుచు బాడబలంఘన మాచరించు, పగిది నౌర్వాంబునిధి దాఁటెఁ బవనసుతుఁడు.

94


ఉ.

ఏపున నాసువేలగిరి యెక్కి యట న్శతయోజనోన్నతం
బై పదియాఱువన్నెఁ జెలువైన త్రికూటముమీఁద సింహల
ద్వీపమునన్ బలారిముఖదేవభయంకరదీప్తి నొప్పులం
కాపురరాజ్యలక్ష్మి తటకావడి చూచుచు నున్ననత్తఱిన్.

95


మ.

రవి యస్తంగతుఁడైన సూక్ష్మతనుఁడై రక్షోధిరాట్పట్టణం
బవలీలం జొరఁబాఱి పఙ్క్తిముఖముఖ్యానేకనాకద్విష
ద్భవనశ్రేణుల నెల్లెడన్ వెదకి సీతం గానఁగాలే కశో
కవనిం బావని గాంచెఁ బావని మహీకన్యం బ్రహృష్టాత్ముఁ డై.

96


శ.

కనుఁగొని లెస్సగ గుఱుతులు, కనుఁగొని యట వచ్చి పఙ్క్తికంధరుఁ డని పో
యినమాటలు విని నమ్మిన, జనకసుతం జేరి మ్రొక్కి సవినయుఁ డగుచున్.

97


తే.

తల్లి జానకి నీ ప్రాణవల్లభుండు, శ్రీరఘూద్వహుఁ డనుజసుగ్రీవముఖ్య
యోధతతితోడ సుఖముననున్నవాఁ డ, టంచు శ్రీరామునంగుళీయక మొసంగె.

98


క.

కైకొని కన్నుల నొత్తుచు, హాకాంత రఘూద్వహా యటంచును బ్రణయ
వ్యాకులితచిత్తయై క్షో, ణీకన్యక యిట్టులనియె నివ్వెఱతోడన్.

99