పుట:Dashavathara-Charitramu.pdf/240

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మ.

అదె కన్గొంటి విచిత్రకూటము ప్రఫుల్లాంభోజపత్త్రాక్షిపై
కుదురయ్యె న్నెలవంక యీచెలువు నీకుం జూడ నెట్లొప్పె మా
కుఁ దగం దెల్పుమటంచు సీత నగుచున్ గోరంటగాఁ జంటిప
య్యెద గప్పంగ రఘూద్వహుండు చని యయ్యద్రీంద్రకూటంబునన్.

20


చ.

రజనిచరాంతకుండు రఘురాముఁడు వేడుకమీఱ జానకీ
గజగమనాసమేతముగఁ గానలఁ ద్రిమ్మర నచ్చటచ్చటన్
ధ్వజకలశాతపత్రసముదంచితతత్పదముద్రఁ జూచి త
ద్రజము మహామునీంద్రులు శిరంబునఁ దాల్తురు భక్తి మీఱఁగన్.

21


వ.

అంత నక్కడ.

22


ఉ.

శత్రుల రావణాదులను జంపు మటంచును రామచంద్రు నా
పుత్రకుఁ బంచితిన్ భయముఁ బొందకు మింకిట నంచుఁ బూర్వపున్
మిత్రుఁడు దేవతాపతికి మేలెఱిఁగింపఁగఁ బోయెనో యనన్
ధాత్రినిఁ బాసి యద్దశరథక్షితిపాలుఁడు చేరె స్వర్గమున్.

23


ఉ.

అంత వసిష్ఠుఁ డంపఁగ రయంబునఁ జారులు వోయి పిల్చినన్
స్వాంతము సంచలింపఁగను సానుజుఁడై భరతుండు వచ్చి య
త్యంతసువర్ణరత్నమయమయ్యు నొకింతయు దాతగాని శ్రీ
మంతునివీఁడుఁబోలెఁ గళమాసిన యట్టియయోధ్యఁ జూచుచున్.

24


తే.

నగరు సొచ్చిన యంతలో నిగుడు వేడ్క, నెదురుగా వచ్చి కైకేయి యిదిగొ నీకుఁ
గాను బంపితి రామలక్ష్మణుల వనికి, జనపతియు నీల్గె ధరణిఁ గైకొను మటన్న.

25


చ.

అడవుల కేఁగె రాముఁడు సహానుజుఁడై యనుమాట వీనులం
బడ భరతుండు మూర్ఛిలి యమాత్యులు దెల్పఁగఁ దేరి కైక నీ
కడుపునఁ బుట్టి నింద కొడిగట్టితిఁగా యని [1]బాష్పనేత్రుఁడై
యడలి పితృక్రియ ల్సలిపి యంతట రాఘవుఁ జేరె వేఁడఁగన్.

26


సీ.

నినుఁ జూడ కుండఁజాలను రార నారామచంద్ర యటంచుఁ గౌసల్య పిలువ
నేరంబు గలదు మన్నింపు మంచును గైక విడక చేతులు వట్టి వేఁడుకొనఁగ
వలదన్నయాపె పిల్వఁగను రారాదొకో[2] పుత్ర యటంచు సుమిత్ర నుడువ
నిందఱు ప్రార్థింప నిది యేటిచలము పోద మటంచు సౌమిత్రి తరువు సేయ


తే.

భరతశత్రుఘ్ను లిరువురు పాదయుగముఁ, బట్టుకొని రాక విడుమంచు నెట్టుకొనఁగ
దొరయునగవునఁ దనదు పాదుక లొసంగి, పనిచె రఘుభర్త పురికదంభరతు భరతు.

27
  1. సాశ్రునేత్రుఁడై
  2. మేలే యటంచు సుమిత్ర