పుట:Dashavathara-Charitramu.pdf/234

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శశిముఖు లేఁగుదేర నిజసైన్యముతో బహుతూర్యఘోషముల్
దశదిశలన్ ఘనంబయి చెలంగ నయోధ్యకు వచ్చుచుండఁగన్.

296


సీ.

రాజహంసాళి దుర్ధర్షకామర్షవర్షతటిచ్ఛటులునా జడలు దనర
స్వకృతరక్తహ్రదసంసూచకంబులై దహనోగ్రరక్తనేత్రములు వెలుఁగ
నిబిడనిజోచ్ఛ్వాసనిశ్వాసపవనతీవ్రమున నా నధరప్రవాళ మదర
శాంతినిర్గమనావసరముఖాద్విశ్లథార్గళులనా దంతసంఘర్ష మొదవఁ


తే.

బాదఘట్టన మేదినీభాగ మగల, గండ్రగొడ్డలి భుజమునఁ గ్రాల వేఁడి
వేఁడి రాముఁ డటంచును విలయరుద్ర, రౌద్రమున వచ్చె భార్గవరాముఁ డపుడు.

297


సీ.

ఇక నేమి సేయుద మెందు డాఁగుద మంచు దశరథేశ్వరుఁ డెదఁ దల్లడిల్ల
సంయమిఁ బుత్రభిక్ష యొసంగు మని వేఁడుదునొ యంచుఁ గోసలతనయ గలఁగ
నిన్న నయ్యెను బెండ్లి నేఁ డిట్టియలజడి వచ్చెనే యని సీత వగలఁ బొగుల
మనచే నసాధ్యుఁ డేమనవచ్చు నిఁక నంచు ననుజు లింతింత నాయత్తపడఁగ


తే.

నల వసిష్టాదు లర్ఘ్యపాద్యములు గొనుచు, నలికి చేరక యూరక నిలిచియుండఁ
జేరి ప్రణమిల్లి యంజలి చేసి యున్న, రాముఁ గనుఁగొని భార్గవరాముఁ డనియె.

298


సీ.

ఖండించె నేవీరకార్తవీర్యావార్యఘనభుజాకదలికాకాననంబుఁ
జండించె నేమహేశ్వరకుమారునితోడఁ గ్రౌంచభూధరవిదారణనిరూఢి
మండించె నేమహోద్దండప్రతాపవైశ్వానరుచే రాజవంశములను
బండించె నేయాగఫలము తండ్రికిని శాశ్వతమగు సప్తర్షిస్థాన మొసఁగి


తే.

యహహ సామాన్యుఁడనె యెంచ నశ్వమేధ, సవనదీక్షాంతకశ్యపసంయమీంద్ర
దత్తసప్తసముద్రాంతధరణితలుఁడ, భార్గవుఁడ ధావదరివాసభార్గవుఁడను.

299


తే.

బాపురే నన్ను బీదబాఁపనివిధంబు, నను గనుంగొని యర్ఘ్యదానం బొసంగ
వచ్చితివె యంచు రోషంబు పెచ్చుపెరుఁగ, రామచంద్రున కనియె భార్గవుఁడు మఱియు.

300


శా.

ఓరీ రాజకులాధమా తెలిసె నోహో నీదుబ్రహ్మణ్య మీ
ఘోరాస్త్రంబుల దానవీహరణమే కోపంచుఁ గావించి తీ
వౌరా తాటక తల్లి గాదు గదవయ్యా భూమి నిఃక్షత్రగా
నేరాసేయుట సత్యవాదివవు లే నే నెవ్వడన్ దెల్పుమా.

301


మ.

అనుచున్ భార్గవరోషపోషణపటువ్యాహారము ల్మీఱఁ ద
ద్ధనువుం తేజముతోడఁ గైకొని సమున్యద్భాహుదర్పంబునం
గొనయం బెక్కిడి యమ్ము గూర్చి యిఁక నీకుం శాస్తి గావింప కేఁ
జన నాబాణ మమోఘ మంచు ధరణీజాభర్త యత్యుగ్రుఁడై.

302