పుట:Dashavathara-Charitramu.pdf/229

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దురుసుగా వెడలెడి బిఱుసులపూవులు భూనభోంతరములఁ బొదివికొనఁగ
నందం దమర్చిన యట్టివిచిత్రంబు బాణవిద్య సురాళి భ్రమయఁజేయ


తే.

నదరువ్రేటులరొదల బ్రహ్మాండ మగల, నెందుఁ జూచిన దివ్వెటీలే వెలుంగ
భూరిశోభనవాద్యము ల్బోరుకలఁగ, బలిసి యెల్లడఁ జతురంగబలము గొలువ.

251


తే.

పదియునాఱేండ్లప్రాయంపుపద్మముఖులు, కాసె గట్టుక మిగులశృంగారముగను
దశరథేంద్రునిమీఁది పదము పాడి, యభినయించుచు నెదుట నృత్యంబు సలుప.

252


సీ.

“జయజీవ వర్ధస్వజగతాంపతే" యంచుఁ జేరి మౌనీంద్రు లాశీర్వదింపఁ
"జండీశ చండకోదండఖండనవిచక్షణ” యంచు వందిమాగధులు పొగడ
శోభనంబులు పాడుచును బుణ్యకాంతలు మునుపుగా గ్రంతలు గొనుచు నడువ
నాప్తమంత్రులును రాజాధిరాజులు దొర ల్నలువంకఁ గ్రమ్ముక కొలిచి రాఁగ


తే.

ముగురుతమ్ములు సరిగ నేనుఁగుల నెక్కి, వెంట నేతేరఁగా రాజవీథి వేడ్క
వచ్చెఁ గోటిసురేంద్రులవైభవమున, భద్రకరి నెక్కి శ్రీరామభద్రుఁ డపుడు.

253


ఉ.

కాంతరొ వీరునల్వురును గంతుజయంతవసంతరోహిణీ
కాంతులొ కాకయున్న మఱిఁ గల్గునె యీభువనైకమోహనా
త్యంతవిలాసరేఖలవిధం బని యొండొరు లాడుకొంచు సౌ
ధాంతరరాజరాజముఖు లారసి యారసికాగ్రగణ్యులన్.

254


చ.

వనితరొ వీరిలో మనసువచ్చిన రాజకుమారుఁ డెవ్వఁడే
యని యొకరాజకన్యఁ జెలి యాడినఁ బో యిది యేటిమాట యం
చును నునుసిగ్గు మీఱఁ దనుఁ జూచినఁ గాదది రూపరేఖక
న్నను రఘురాముఁడే యనిన నవ్విరి తోడిసకు ల్కిలాకిలన్.

255


మ.

వనజాతాయతపత్రలోచనలు భావం బిట్లు రంజిల్లఁగాఁ
గనుచు న్సేసలు జల్ల నుల్లసితశృంగారంబు భాసిల్ల న
ల్లన నేతెంచి విదేహవల్లభుని జాల్వాపెద్దమోసాలఁ జం
గున దంతీంద్రుల డిగ్గి యారతులు గైకొంచున్ రఘుగ్రామణుల్.

256


మ.

జనకక్ష్మావిభువెంబడి న్నడచి చంచద్దివ్యమాణిక్యదీ
పనికాయంబు ఫలోల్లసత్కనకరంభాస్తంభసంభావితం
బును స్వర్ణాబ్జపటీవితానకలితంబు న్సర్వలోకైకరం
జనమౌ హేమవివాహమండపమున న్సౌవర్ణ పీఠంబులన్.

257


క.

ఆసీనులైన యత్తఱి, శ్రీసీతాకన్యకాదిసీమంతినులన్
రాసుతలఁ దోడి తెచ్చిరి, భానురతను కాంతి బయలు బంగరు సేయన్.

258


వ.

అంత వసిష్ఠవిశ్వామిత్రశతానందాదిముదితవిప్రప్రవరసముదితమంత్రపూర్వకం
బుగా లక్ష్మణపూర్వజు పదారవిందంబులు గడిగి మణిమయభూషణాదిపరిణయ
దక్షిణాసంపర్కం బగుమధుపర్కం బొసంగి.

259