పుట:Dashavathara-Charitramu.pdf/222

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

వేడ్క గాధేయుఁ డేతేర విని విధేయుఁ, డగుచు మిథిలాధినాథుండు నగరు వెడలి
యమితగజవాజిభటసంకులముగ నెదురు, కొని సపర్య లొసంగి తోకొనుచు వచ్చి.

188


మ.

జనకక్ష్మాపతి కొల్వుకూటమున విశ్వామిత్రు శ్రీరామచం
ద్రుని సౌమిత్రి యథోచితాసనములందు న్నిల్పి పీఠస్థుఁడై
మునిజంభారి ఫలించె నామఘ మఖంబు ల్దూరమైపోయెఁ బా
వనమయ్యెం గులముం గులంబు ననుచు న్వాక్ప్రౌఢి వర్ణింపఁగన్.

189


తే.

జనకచిత్తంబు శ్రీరామచంద్రుఁ దగిలి, కనియె బ్రహ్మానుసంధానమునను గాంచఁ
దవిలి నానంద మపుడు ప్రత్యక్షమైన, సగుణ మట్టిప్రమోద మెసంగు టరుదె.

190


వ.

ఈచందంబున రఘునందను శతకోటికందర్పసౌందర్యుని దర్శించి యమందానం
దంబు నొంది జనకజగతీసంక్రందనుం డిట్లని వితర్కించె.

191


సీ.

సృష్టికిం బ్రతిసృష్టి చేసెనంచును వింటి మీమునీంద్రునిఁ దొల్లి యిపుడు నిచట
నొకట నింద్రోపేంద్రులకుఁ బ్రతినిర్మించెనో లేక సూర్యచంద్రులకుఁ బ్రతియొ
మన్మథునకుఁ బ్రతిమన్మథులో యటు గాకున్న రాజలోకంబునందుఁ
గలుగునే యింత చక్కఁదనంబు పురుషులమనసు హరించె స్త్రీజనము లెంత


తే.

యందు నీయగ్రజుని చెల్వ మరిఁది పొగడ, నితనికిఁ గుమారి నొసఁగి నాయింట నుంచి
కొనెడి భాగ్యంబు దొరకునొకో య టేల, గలుగు దుష్టప్రతిజ్ఞుఁడఁ గాన నేను.

192


శా.

ఏలా చేసితి దుష్ప్రతిజ్ఞ యిఁకఁ జండీశానకోదండ మీ
బాలుం డెక్కిఁడఁజాలకుండిన వృథా పంపింపఁగా నేర్తునే
చాలింపం దగునే ప్రతిజ్ఞ నగరే పాలకు ల్వచ్చె నాం
దోళం బే నిఁక నెట్టిచందమునఁ దీర్తుం ధర్మసందేహమున్.

193


తే.

అని మహాహ్లాదమున విదేహాధినేత, వీర లెవ్వారలో సుకుమారమూర్తు
లనిన దశరథరాజనందనులు వీరు, ధనువుఁ జూడంగ వచ్చినా రనియె మౌని.

194


క.

అనవుఁడు పరమాద్భుతమున, జనకుఁడు దశరథున కిట్టిసంతానము గ
ల్గెనె యిష్టి సఫలమయ్యెనె, కనుఁగొంటిమి నాఁటి యత్నగౌరవ మెల్లన్.

195


ఉ.

శ్రీశుఁడు క్షీరవార్ధి వసియించుట మాని మహిన్ మహీశుఁడై
యీశశరాస మెక్కిడిన నెక్కిడెఁగాక మనుష్యమాతృ లీ
యాశలఁ జెంద నేటికి సురాధిపముఖ్యులచేత నైనఁ గా
దీశిశువు ల్గనుంగొనఁగ నేమిఫలంబు తపోధనాధిపా.

196