పుట:Dashavathara-Charitramu.pdf/223

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

అనవుడు నిక్కమౌను మనుజాధిప నీవనుమాట యైన యీ
జనవరనందను ల్గనఁగ సంతసమందినవారుఁ జూడనీ
ధనువులు వీరిముచ్చట వితావితసేయకు మన్న మౌని మీ
మన సనుచు న్విదేహనృపమౌళి యనేకులఁ బంప వారలున్.

197


చ.

మమత సురాసురు ల్దొలుత మందరభూమిధరంబుఁ దెచ్చుచం
దమున మహేశచాపసముదంచితపేటికఁ దెచ్చియుంచినం
బ్రమదము పూని మౌని రఘురామ కనుంగొను మీశరాసముం
దెమలుప నేర్తువే యనిన ధీరుఁడు శ్రీరఘువీరుఁ డయ్యెడన్.

198


సీ.

తనవిల్లునమ్ములుఁ దమ్మునిచే నిచ్చి మేరుగిరీంద్రంబుమీఁదనుండి
దుమికెడి కొదమసింగముమాడ్కి మణిపీఁఠి డిగి నగుముద్దునెమ్మొగముతోడ
జాఱెడిసిగ కేలఁ జక్క నొక్కుచునుఁ జెక్కులను గట్టాణిచౌకళి నటింప
వలెవాటు నెఱనీటు వలిపెచందురుకావి చేలచెఱంగులు నేలజీర


తే.

దివ్యభూషణకాంతులు తేజరిల్ల, సీత నెచ్చెలు లాడాడఁ జేరిచూడ
నఖిలరాజన్యు లచ్చెరువంద దివిని, సొంపు మీఱి నిలింపులు గుంపుగొనఁగ.

199


తే.

సకలలోకైకమోహనచారురూప, సంపద లెసంగ శ్రీరామచంద్రుఁ డపుడు
గంధమంధరసింధురగమనలీలఁ, జెలువుమీఱంగ నల్లనఁ జేరనరిగి.

200


క.

మందసముత్సాహుల కిఁక, మందుసుమీ యసమసంగ మనుజులు హరువి
ల్మందసముఁ దెఱచిచూచె, న్మందసముద్రేకహరకుమారుఁడు గడిమిన్.

201


సీ.

ప్రత్యక్షమై మించుభర్మశైలముఁ బోలి బహునుపర్వాఢ్యమై పరిఢవిలుచు
దృగ్గోచరం బైన దృక్కర్ణవతిఁ బోలి జ్యావహనోచితసార మగుచు
సాక్షాత్కరించిన శైవధర్మముఁ బోలి ద్రిపురనిర్వాహణనిపుణ మగుచు
నెదుటఁ దోఁచిన నిర్జరేంద్రచాపముఁ బోలి బహువర్షసూచకప్రబల మగుచుఁ


తే.

గనకమయచిత్రకాండప్రకాండ మగుచు, బద్ధమణిఘంటికాకోటిభాగ మగుచు
సర్వభూభృద్భయదవజ్రసార మగుచు, నద్భుతంబైన శంభుశరాసనంబు.

202


క.

కనుఁగొని శ్రీరఘువీరుఁడు, వినతానందనుఁడు సర్పవిభుఁ బట్టెడుమా
డ్కిని కుంభీంద్రము రంభా, వనిజముఁ బెకలించుప్రాభవం బలరారన్.

203


సీ.

లీలఁ గెంగేలఁ గీలించి లేనగవుతో ధరణీశ తాతలతరమునాఁటి
పాతపంచారంబు పసలేదు పేటెత్తె నిది వృథాస్థూల మిందేది బలము
అని మింటికొప్పు గల్గినవాని బలువింటికొప్పున జానకికొప్పుమీఁదఁ
గేలుంచువేడుకఁ గీలించి యటువంచి ధర్మంబు సుగుణయుక్తంబు చేసి


తే.

ఠీవిఁ గళ్యాణవార్తఁ జాటించు ఠేవ, నారి మొఱయించి తెగనిండ నారి దిగిచి
లస్తకస్తలవిన్యస్తహస్త మింత, సళ్ళ ఫెళఫెళఫెళమంచు విల్లు విఱిగె.

204