పుట:Dashavathara-Charitramu.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మ.

అనినం దైత్యసుతుండు భూమిసురులారా వంశము న్ముఖ్యమౌ
జనకుండుం బతి మూఁడులోకములకున్ క్ష్మాదేవత ల్గొల్తు రే
నును సేవించెద గౌరవంబున ననంతుం గొల్వవద్దన్న మా
నను నాకుం బురుషార్థదాయకుడు శ్రీనారాయణుం డెమ్మెయిన్.

202


చ.

అనవుఁడు శుక్రపుత్రులు దురాగ్రహమెచ్చఁగ నోరి దుర్మతీ
యనలభయంబు మాన్పి దనుజాధిపు వేడుక నిన్నుఁ దెచ్చి యే
యనువున బుద్ధి చెప్పిన నహంకృతిచే విననొల్ల వింక నో
ర్చిన దనుజేశ్వరుం డలుగుఁ గృత్తి సృజించెద మన్న నవ్వుచున్.

203


క.

మీ రెవ్వరు రక్షింపఁగ, మీ రెవ్వరు శిక్ష సేయ మిమ్మును నన్నుం
గారుణ్యంబున బ్రోవఁగ, శ్రీరమణుం డున్నవాఁడు చింతిల నేలా.

204


తే.

అనినఁ బ్రహ్లాదుఁ జూచి బ్రాహ్మణులు మాకు, బుద్ధి చెప్పఁగ వచ్చితె ప్రోడ యనుచు
నలిగి యభిచారహోమంబు లాచరింపఁ, గృత్య జనియించె హరణైకకృత్య యగుచు.

205


సీ.

విరియఁబోసిననల్లవెండ్రుక ల్మొగులులో గిరిగొను మెఱుఁగుఁదీఁగెల ఘటింప
మద్యపానవిఘూర్ణమానలోచనములు వినువీథి నంగారవృష్టి గురియ
నాజానులంబివక్షోజతాడనములఁ గులభూధరంబులు గూలఁబడఁగఁ
జరణఘట్టనముల సైరింపఁగాలేక మ్రొగ్గ శేషునితోడ దిగ్గజములు


తే.

కహకహార్భటి బ్రహ్మాణ్డకటము పగుల, నోట నిప్పులు గ్రక్కుచు సాటిలేని
యుదుటు మీఱంగఁ బ్రహ్లాదు హుంకరించి, లావు చేఁబూని చేతిశూలమున వైచె.

206


క.

వైచిన నదియును నిఖిలా, రాచక్రము గాఁగఁ దాఁకి చక్రిసమేతం
బౌచిన్నివానిహృదయము, పైచర్మము దూఱలేక భగ్నం బయ్యెన్.

207


తే.

అది విలోకించి కృత్తి భీతాత్మ యగుచు, గెరలి హరిభక్తుపైఁ బ్రయోగింపఁ దగునె
పాపులార యటంచు నాబ్రాహ్మణులను, దవిలి తపియింపుచును మ్రింగఁ దఱిమికొనఁగ.

208


క.

వెఱపింపఁబోయి వెఱచిన, తెఱఁగున దందహ్యమానదేహు లగుచుఁ జె
చ్చెరఁ బరువిడు విప్రుల ముం, దఱఁ గని బ్రహ్లాదుఁ డపుడు దయదైవారన్.

209


మ.

గరళాహీంద్రగజాగ్నివాహములచేఁ గారింపఁగా వచ్చున
ప్పరుల న్మైత్రిని గాంతునేని త్రిజగత్పాలుండ వీవైన నో
హరి సర్వాత్మక విశ్వరూప పరమాత్మా వీరి రక్షింపవే
త్వరగా నంచు నుతింపఁ గృత్తి సనె నంత న్భూసురు ల్వేడుకన్.

210