పుట:Dashavathara-Charitramu.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

అనినఁ దదీయవచనరచనాదోహదధూమస్తోమపోషితరోషదాడిమీతరు
పరిపక్వప్రసవపత్రనిదర్శదర్శనారుణ్యంబున బాలుం గనుంగొనుచున్న దను
జపాలు న్విలోకించి భృగునందను లమందమృదుమధురసల్లాపంబుల సంస్తుతిం
చుచు నిట్లనిరి.

192


ఉ.

ఏమిటి కింతకోప మసురేశ్వర నీసుతుఁ డింతెకాని వీఁ
డేమి పరుండె మున్నె ఫలియించెఁ గదా మిషయేల దేవసం
గ్రామమునందె యింక నిట గారణ మేమి శమింపఁజేయుమీ
సామవచోవిశేషముల సాధు నొనర్తుము బాలు నిత్తఱిన్.

193


క.

నానోపాయంబుల నీ, సూనునకుం బుద్ధి సెప్పి చూచెద మటుగా
దేని హరింతుము మాహో, మానలమునఁ గృత్య దెచ్చి యద్భుతలీలన్.

194


క.

అని కనకకశిపుననుమత, మున బాలునిఁ దోడుకొనుచుఁ బోయిరి గేహం
బునకు శుక్రకుమారులు, నెనరున దద్గేహమునను నెలకొని యతఁడున్.

195


క.

గురువులు సెప్పినరీతి, న్నిరతముఁ బఠియించు రాజనీతిని మఱియా
గురువులు లేనియెడ న్బా, లురకు న్హరిభక్తి వత్సలుండై తెలుపున్.

196


తే.

గురువు సెప్పినచదువెల్లఁ గుటిల మనుచు, నెల్లసంసారమును దుఃఖహేతు వనుచు
విష్ణుఁడే సేవ్యుఁ డంచును వివిధగతులఁ, దెలిపి లోఁజేసికొనియె బాలురను దనకు.

197


తే.

ఇటుల బాలుర బోధించు టెఱిఁగిఁ గురుఁడు, దనకుఁ జెప్పిన విబుధారి గినుకతోడఁ
దనదుపట్టికి విషమిడుఁ డనఁగ వారు, నన్నపానంబులను హాలహలము నిడిరి.

198


ఉ.

శ్రీమదనంత యంచు నభిషిక్తము సేసి విషాన్న మెల్ల నెం
తేముద మొప్పఁగా మెసవె ధీరుఁడు దైత్యకుమారుఁ డట్టిచో
నేమివికారముం బొరయఁ డెప్పటికన్నను దృప్తిఁ గాంచె ను
ద్దామహలాహలం బుదరధామమున న్వసియించె నత్తఱిన్.

199


ఉ.

ఆమహిమంబు సూచి దనుజాధిపుఁ డెంతయు భీతచిత్తుఁడై
తామస మేల యింకిటను దైత్యపురోహితులార వీని కిం
కేమిట బుద్ధిరాదు సృజియింపుఁడు కృత్తినటంచుఁ బంప నా
భూమిసుధాశను ల్మఱియు బుద్దులు చెప్పుచుఁ జేరి బాలకున్.

200


మ.

అతిముఖ్యంబు భవత్కులంబు జనకుండన్నం ద్రిలోకేశ్వరుం
డతులైశ్వర్యము వేఱె తెల్పవల దేలా విష్ణు సేవింపఁగాఁ
బితృసంసేవ సమస్తలోకపతివై పెంపొందరాదే మహా
క్రతువు ల్సేసి జను ల్భజింపఁ గనవే క్రవ్యాదచూడామణీ.

201