పుట:Dashavathara-Charitramu.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

దనుజనాయకుఁ డంత నందనునిఁ గాంచి, బాల యీలీల నూరకె జాలిఁ జెంద
నేల యిఁకనైన హరి యంచు నెంచుకున్న, నభయ మిచ్చెదనన్నఁ బ్రహ్లాదుఁ డనియె.

182


క.

తనపేరు దలఁచినంతనె, జననాదిభయంబు లుడుపఁజాలినహరి నా
మనమున నుండఁగఁ దండ్రీ, ననుఁ జెందునె యాభయం బనాథునిభంగిన్.

183


క.

నావుడు విని యింకను నీ, కావర మడఁగదె యటంచు ఘనరోషమునన్
దేవారి తక్షకాదుల, రావించి కుమారునిం గఱవఁ బనుచుటయున్.

184


మ.

నిజదంష్ట్రాగ్ని సమేధమానవిషవహ్నిజ్వాలికామాలికల్
త్రిజగద్దాహము సేయఁగాఁ గదిసి దైతేయార్భకుం బాదముల్
భుజము ల్ప్రక్కలు బిక్కలుం గఱచె నాభోగీంద్రమ్ము ల్నల్గడన్
భుజగారాతిహయస్మృతి న్మఱచె మేనుం బాలుఁ డాహ్లాదియై.

185


క.

అఱిముఱిఁ దొమ్మిదికోటులు, నఱువది వేలైన తక్షకాదిమహాహు
ల్కఱకుంగోఱల విషములు, దొఱుగఁగ నీరీతిఁ గఱచి తూలుచు నంతన్.

186


క.

పడగలగలరత్నంబులు, గడఁబడ నొడ లుడుక దంష్ట్రకలు పొడిపొడి గాఁ
గడుబాములకున్ లోనై, గడుసరిపాములు దొలంగఁ గడురోషమునన్.

187


మ.

దనుజాధీశుఁడు పంప నంతటను దిగ్దంతావళేంద్రంబులం
గొని డీకొల్పిన దద్గజంబులు మదోద్వేగంబునన్ దైత్యపు
త్రుని దుండంబులఁ జుట్టి రాఁదిగిచి తోడ్తో ధాత్రిపై వైచి త
ద్ఘనవక్షఃస్థలి గ్రుమ్ముచో విఱిగె దంతంబు ల్విచిత్రంబుగన్.

188


మ.

అంత న్బాలుఁడు దండ్రిఁ జూచి దనుజేంద్రాధ్యక్ష కంటే శచీ
కాంతస్ఫారకఠోరవజ్రతులితాకారంబులౌ సర్వది
గ్దంతీంద్రంబుల దంతము ల్విఱిగె మద్వక్షంబునం దిట్టి య
త్యంతాంగద్రఢిమన్ హరిస్మరణమాహత్మ్యంబుగా నెన్నుమీ.

189


మ.

అనినం బాలక యేల ప్రేలెదవు పోరా యెంత నీసత్వమం
చును దిగ్దంతులఁ దియ్యగా బనిచి రక్షోవీరులన్ హెచ్చుగా
ననలంబుం దరికొల్పుమంచుఁ బవమానా వీని శోషింపు మీ
వని పంపం దనుజాత్మజుండు శుచియం ధారూఢుఁడై యిట్లనున్.

190


సీ.

శ్రీమించు గ్రొమ్మావిచిగురుగుంపులు నలుగడఁ దోరణంబులు గట్టినట్లు
నిండుపున్నమనాఁటినెల విచ్చుచెంగల్వవిరుఁ మేల్కట్లు గావించినట్లు
బాలభానుప్రభం బ్రహసించు నరుణాబ్దపత్త్రము ల్పఱుపుగాఁ బఱచినట్లు
తావి గల్గిన బంధుజీవప్రసూనము ల్సేసగాఁ బైని వర్షించినట్లు


తే.

చల్లఁగాఁ దోఁచుచున్నది సకలదిశలఁ, బీనపవమానజాజ్వల్యమానదహన
కీలజాలంబు లౌక్యంబు గీలు కొల్పి, తాప మొనరింప దింతైన దానవేంద్ర.

191