పుట:Dashavathara-Charitramu.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మ.

భళిరా నేఁడు ప్రసంగసంగతులచేఁ బ్రహ్లాదుఁ గీర్తింపఁగా
గలిగెన్ జిహ్వ పవిత్ర మయ్యె విను వక్కాణింతుఁ దద్బాల్యచే
ష్టలు భక్తి న్వినువారి కందఱికి విజ్ఞానంబు వైరాగ్యమున్
జలజాతేక్షణుభక్తియుం గలుగు నాశ్చర్యంబుగా భూవరా.

139


తే.

డోలికాకేళి సల్పెడువేళ నుపరి, భాగమణిగుచ్ఛమునను దీపంబునందు
దృష్టి నిల్పఁడు హృదయదేదీప్యమాన, పరమహంసత్వమును మదిఁ బదిల మగుట.

140


ఉ.

పూని కడానిడోలికను బొత్తులలోఁ బవళించియున్ హరి
ధ్యానపరాయణుండు ప్రమదాశ్రులు పూనఁగఁ జూచి నెచ్చెలు
ల్దేనియమోవిపై నగవుదేరెడు గం దడియంట నేల యెం
తేనియు విస్మయంబని గణింతురు కాంతురు మాటిమాటికిన్.

141


క.

పొత్తులలోఁ బవళించిన, యత్తఱినూరుపులు నిలువ నంతర్దృష్టిం
జిత్తము హరి హత్తించిన, యుత్తముఁ గనుఁగొన్న దాదు లుంకుదురు మదిన్.

142


తే.

అమ్మ బువ్వఁ బెట్టు మనఁ డొకనాఁడైనఁ, గన్నతల్లి పైఁడిగిన్నెలోనఁ
బాలు నన్న మిడిన బత్తితోఁ గృష్ణార్పి, తంబుచేసి మెసవు దైత్యసుతఁడు.

143


క.

రారా ననుఁ గనుతండ్రీ, రారా నాముద్దులయ్య రారా యనుచుం
గూరిమిని దల్లి పిలిచినఁ, జేరంగాఁబోఁడు విష్ణుచింతాపరుఁడై.

144


తే.

జననితో నుండి యిదిగొ నాస్వామి వచ్చె, ననుచు డిగ్గన లేచి సాష్టాంగ మెఱఁగి
దేవ రక్షింపు మంచు నుతించువాఁడు, గాన మొనరించు నేడుచుఁ గానకున్న.

145


మ.

జనకుం డయ్యలు విద్దె మేది యనఁ గృష్ణా రామ గోవిందయం
చు నటించుం గరతాళవైఖరులతో జోడందియ ల్మ్రోయఁ జ
క్కనిలేఁజెక్కుల మద్దికాయలరుచుల్ గన్పట్ట బాలేందుఁ బో
లినఫాలంబున రావిరేక గదలన్ లీలావిలాసంబులన్.

146


వ.

ఇవ్విధంబున దినదినప్రవర్ధమానదానవాహితపదారవిందానూనధ్యానామృ
తపానంబున దరీదృశ్యమానప్రపంచ మంతయు మఱచి విదళితదేహాభిమానుం
డగుచు నున్మత్తుని తెఱంగున స్వేచ్ఛాలబ్ధాశనాచ్ఛాదనుం డగుచు నితరకృ
త్యంబు లుడిగి యాతాయత్తచిత్తంబున నవధూతవృత్తిని వర్తిల్లుపుత్రకునిం
గని తదీయజనకుండగు కనకకశిపుఁడు చింతాక్రాంతుఁ డగుచు శుక్రకుమారు
లగు చండామార్కులం బిలిపించి యిట్లనియె.

147


క.

మునిపుత్రులార నాతన, యునిఁ గంటిరె వీని కేమి యున్మాదంబో
ఘనమగు భూతము పట్టెనొ, వినిపింపుఁడు వీనిమహిమ వింత యటన్నన్.

148


క.

దానవనాయక చదివినఁ, గాని వివేకంబు రాదు గావున మేమే
వీనిఁ జదివించి మతిగల, వానిం జేసెద మటంచు వారు దదాజ్ఞన్.

149