పుట:Dashavathara-Charitramu.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

దైత్యనాథుని బ్రహ్మరంధ్రంబు పగిలి, ధూమ మొక్కటి పొడమె నస్తోకమగుచు
నదియ నిండి యకాండగాఢాంధకార, బంధురత సంఘటించెఁ బ్రపంచమునకు.

75


తే.

వెంటనె తపోగ్ని ఘోరమై వెడలుటయును, శరధు లుడుకెత్తె సురగిరి కరఁగెఁ బుడమి
మంగలంబయ్యె దిక్కులు మాఁడె గృహము, లన్ని యంగారదశ నొందె నాక్షణంబ.

76


తే.

ఉగ్రతరసప్తజిహ్వల నూర్ధ్వలోక, దాహ మొనరింతు ననురీతిఁ దత్తపోన
లము భువర్లోకమును మించి యమరనగరి, దగులుకొన్న సుపర్వులు దల్లడిలుచు.

77


క.

వనవహ్ని దవులుకొన్న, న్వినువీథికి నెగురుపక్షివితతులవలె న
య్యనిమిషులందఱు సత్యం, బునకుం జని నలువపాదముల కానతు లై.

78


మ.

దనుజాధీశతపోనలంబు త్రిజగద్దాహంబుఁ గావింప నెం
దును నిల్వ న్వసగాక వచ్చితిమి తోడ్తో వహ్ని వారింపుమా
యన కోర్కు ల్సమకూర్చి తామసము సేయ న్న్యాయమే చేసినం
బునరుద్యోగము సేయఁగావలె జగంబు ల్గల్గ లోకేశ్వరా.

79


తే.

అనిన జలజాసనము డిగ్గి వనజగర్భుఁ, డంతలో సాది దెచ్చిన యంచతేజి
నెక్కి భృగ్వాదు లయిన యనేకఋషులు, వెంటరా సత్యలోకంబు వెడలివచ్చి.

80


సీ.

మందరశైలంబునందు నొకానొకకోనలోఁ గానలోఁ గుమురుగాఁగ
బలసిన వెదురుజొంపముక్రింద దట్టమై పులుచుట్టుకొన్నట్టి పుట్టలోన
నీఁగలు చీమలు మూఁగి మైఁ గలిగిన చర్మంబు రక్తమాంసంబు మెసవ
నెమ్ములడింబ మై యెప్పటితననిష్ఠఁ దప్పక మొగులుచేఁ గప్పఁబడియు


తే.

నినుఁడు లోకములను దపియించు లీల, ఘనతపోనలశిఖల లోకములు వేఁచు
కాశ్యపునిఁ గాంచి విస్మయాక్రాంతుఁ డగుచు, భారతీకాంతుఁ డి ట్లని పలికె నపుడు.

81


సీ.

లేలెమ్ము కాశ్యప మేలగు నీకు నీతపము ఫలించు నీతలఁచుకోర్కి
యీయ వచ్చితి వేఁడు మేఁగంటి నీధైర్య మారయ నద్భుతం బయ్యె మాకు
దేహ మీఁగలు మూఁగి తినిపోవఁ బ్రాణము ల్శల్యగతంబులై సడల నిపుడు
నిట్టితపంబు ము న్నేఋషివరులు గావింపరు మీఁదఁ గావింపలేరు


తే.

జలము గోరక దివ్యవత్సరశతంబు, దనువు భరియింప నెవ్వరితరము నీకుఁ
జెల్లె గెల్చితి మమ్ము సుస్థిరసమాధిఁ, గోరు కోరినవరము సేకూర్తు నీకు.

82


మ.

అనుచుం బాణికమండలూదకము దైత్యస్వామిపై వంచె న
త్యనఘాత్మీయకృపానిరీక్షణసుధాధారాళధారాఢ్యమై