పుట:Chinnanati Muchhatlu K N Kesari 1999 206 P.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

150 చిన్ననాటి ముచ్చట్లు

గడుపుచుంటిని, అంటు జోడు, ఉంగరములను అమ్మివేసితిని. గడియారము గొలుసును కరగించితిని, తాంబూలమును మానితిని. పరదేశ వస్తువుల మీది బ్రాంతి విడిచితిని. బాధించుచుండు క్రిమికీటకాదులను హింసించునప్పుడుకూడ మహాత్ముడు మనసునకు వచ్చుచుండును. దినచర్యలలో పలుమారు మహాత్ముడు జ్ఞాపకమునకు వచ్చుచుండును.

పుణ్యపురుషుల నిర్యాణానంతరమున స్వర్గమునుండి పుప్పక విమానము భూలోకమునకు వచ్చి పుణ్యాత్ములను కైవల్యమునకు తీసుకొని పోవునని పురాణగాథలను వినుచుంటిమి. గాని 12-2-48, దివసమున మద్రాసునందు ప్రత్యకముగా చూడగల్గితిమి.

మద్రాసు సముద్రతీరమునకు మహాత్ముని అస్థుల పుప్పకవిమానము వచ్చినప్పడు ఆ దృశ్యము చూచుభాగ్యము ఈ పురజనులకు లభించుట వారు చేసిన పుణ్యఫలము. ఈ విమానమునకు ముందు గవర్నరు, వారి సతీమణి, జడ్డీలు, మంత్రులు పురపాలకవర్గము పాదచారులై నడుచు చుండుట చూడ మహాత్ముని మాహాత్మ్యము మనసుకు వచ్చెను.

ఎందరో రాజాధిరాజులు ఈ పట్టణమునకు వచ్చినది నాకు దెలుసును. దేశసౌభాగ్యమునకు పాటుబడిన దేశభక్తులలో ముఖ్యులగు సురేంద్రనాథ బెనర్ణి, బిపిన్ చంద్రపాల్, తిలక్ మహాశయుడు, గోపాలకృష్ణ గోఖలే, లాలాలజపతిరాయి, సి.ఆర్.దాస్ మొదలగువారు మద్రాసుకువచ్చి ఉపన్యాసములను యిచ్చినది నాకు తెలుసును. అట్టివారి కెవరికిని ఈవైభవము జరిగియుండలేదు.

మహాత్ముని అస్థులను మద్రాసు గవర్నమెంటు మందిరమున ప్రతిష్ట చేసిరి. ఆ అస్థులను పవిత్రమగు ఖద్దరు వస్త్రమున మూటగట్టిరి. ఆ మూటలను పుష్పక విమానమందుంచిరి. ఆహోరాత్రములు నేతితో