పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/777

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శాస్త్రిగారి "క్షమాపణ"

881


విశదంగదా? ఆ గీరతాన్నే తమరు “శృంఖలంలో యీసడించారు. మీకు బోధించతగ్గ వాణ్ణిగాను కాని, కవిత్వమన్నప్పుడు, యేరసంలో మొదలు పెడతాడో కవి, ఆ రసంలో మెప్పించుకోవడమే అనుకోండి. మీరందఱున్నూ గ్రంథాలు వుచితంగా పంపి వారి వారి అభిప్రాయాలు కోరడం నేనెఱుఁగుదును. నేనెవ్వరికిన్నీ పుస్తకం పంపడంగాని అభిప్రాయం అడగడంగాని కలలో కూడా యెఱుఁగనే యెఱుఁగను. అడిగితే తప్ప యెవ్వరికిన్నీ పుస్తకం చూడమని చేతులో పెట్టను. ఇప్పటి మాటకేమి? నేను మునుపు మీకు ముఖ్యప్రేమాస్పదుణ్ణే గదా, యెప్పుడేనా పోస్టుద్వారాగాని ప్రత్యక్షంగా కాని వక పుస్తకమేనా దయచేసి చూడండని దాఖలు చేసుకున్నానా; యెందు చేత? నా వ్రతానికి భంగం కలుగుతుందనే. నా తాత్పర్యమేమింటంటే, రిజిష్టరు ఖర్చులు వగయిరాలు పెట్టుకొని వుచితంగా పుస్తకం పంపినప్పుడు యెంత యిష్టంలేనివారైనా మంచి అభిప్రాయాన్నే యిచ్చి తీరుతారనే. ఆలాటి అభిప్రాయా లెందుకు పనికొస్తాయో చూడండి. ప్రస్తుతమేమిటంటే : యిట్టి పొగరుమోతు గీరతానికి యెందఱో ప్రాజ్ఞులు సదభిప్రాయాలు వారంతట వారే వ్రాశారు. యిది నా ప్రజ్ఞ అనుకొందునా? లేక కాలపు వైపరీత్య మనుకొందునా? మీరు దాన్ని మహాగ్రంథమని పూర్తిగా నిరసించారు కదా? అయితే అప్పటికే కొల్లాపురం గోల వచ్చింది కాఁబట్టి అది కోపంవల్ల యీసడించినట్లు జమకట్టుకొన్నాను. మీకున్నూ కృష్ణాపత్రికకున్నూ ఈలాటి కోపకారణం లేశమున్నూ లేదే? లేకున్నప్పుడు మీ భారతాన్ని "ఊరక పద్యముల గణబద్ధము చేసినంత మాత్రమున” అని నిరసించి వ్రాయఁగలిగింది కదా? యిందలి యాథార్థ్యమును మీరు గమనించనే లేదు. మీ పొత్తము సర్వమున్నూ నీరసమని నేననను. కాని మీరుపైవారి వ్రాఁతలకు ఆధారంగా కొంత రచన చేశారు.

క. స్త్రీస్వాతంత్ర్యము లేమిన్
    మా స్వాములవారు వచ్చి మసలక నీకున్
    సుస్వాదువృత్తి నిచ్చిన
    ఓ స్వారాడ్తుల్య నన్ను నొందుము పిదపన్

యీ నా వుదాహరించిన మీ పద్యంలో స్వల్పంగా వ్యత్యాసం వుంటే క్షమించండి. ఈ విషయములో నన్నయ్య పద్యం చూడండి.

క. కరుణానిరతులు ధర్మ
   స్వరూపు లింతకు మదీయజనకులు చనుదెం
   తురు. వారు వచ్చి నీకి
   చ్చిరేని పాణిగ్రహణముచేయుము నన్నున్.