పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/776

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

880

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


“సశేషం" అని తుట్టతుదను వుటంకించి నేఁడో రేపో జరుగుతుంది. అందుచే పత్రికవా రాపిన ప్రయోజనం వుండదు. "కోడీ కుంపటీ లేకపోతే తెల్లవారదా?" పోనీ తమ హృదయములో యిది యింతతో చల్లాఱితే మంచిదని నిజంగా వుందనుకొందామంటే యీ వాక్యం చిత్తగించండి, “నువ్విపుడు కృష్ణాపత్రికలో రాస్తూన్న రాతలన్నీ నేను చూస్తూనే వున్నాను. అవి చాలా హెచ్చుతగ్గులుగా వున్నాయి" అన్నారు కదా? యిదివఱలో కృతఘ్నత్వ ప్రయుక్త దోషాలు మూఁడింటినే ఆపాదించారు. ఇపుడు మళ్లా తప్పుడు వ్రాఁతలు వ్రాస్తూ వున్నట్లు వుటంకించారు. యిఁక దోషాలయిదింటికీ వకటిమాత్రమే తరవాయనుకొందునా? మఱి యేమనుకొందును? “నువ్వు కొన్ని సంగతులు వ్రాసినప్పుడు నేను వాటికి తగినట్లు మఱికొన్ని సంగతులు వ్రాయవలసివస్తుంది.......... నీ వ్రాసిన వ్రాఁతలన్నీ సప్రమాణంగా ఖండించి వాటికి మారు రాసి లోకాన్ని వొప్పించగలను. అయితే దానికి నేనిప్పుడంగీకరించిన చిత్తంలోలేను" తుట్టతుది వాక్యాన్ని గుఱించి నేనేమిన్నీ మనవి చేయఁజాలనుగాని, తక్కిన వాక్యాలను గూర్చి మాత్రం మనవి చేసుకుంటాను. వ్రాయవలసిన సంగతులుంటే వ్రాసి లోకులను వొప్పించవలసిందనే నా ప్రార్ధన ముమ్మాటికిన్నీ “నేనెవరితోనో యేమో చెప్పినాననిన్నీ. చెప్పఁగా వారుత్తరం వ్రాశారనిన్నీ... చెప్పడం తప్పుగాకపోదు." ఈ వాక్యాల కర్థమేలేదు. హైదరాబాదు వుత్తరం సంగతి తామొప్పుకొనుచునే యున్నారుగదా? తక్కినది తమ "శృంఖలం"లో వున్న విశృంఖలపు వాక్యాలు. అంతేనేకాని “యెవరో యెవరో” లు కావు. శృంఖలగ్రంథం వకటి నాకు గుంటూరులో లభించిందని యిదివఱకే వ్రాసివున్నాను. నిన్నమొన్న విశాఖపట్టణంలో వక రావుసాహేబుగారి వద్దకూడా వున్నట్లు వారే చెప్పారు. వారిని తమరున్నూ యెఱిఁగివుంటారు. యింకా యెందఱివద్ద యెన్నివున్నాయో? ఆ పుస్తకం తమరు చాలా ఆలోచించి వ్రాసిందేకాని మఱోమోస్తరుదికాదు. ఖండన గ్రంథం గదా? హైదరాబాదు వుత్తరంలాగు అందులో వ్రాఁత ప్రమాద ప్రయుక్త మనడానికి అవకాశం చిక్కదనుకొంటాను. కోపం వచ్చి అలా వ్రాశానని వ్రాయడమేతప్ప నాకు ఆ తొందరపాటు సవరణచేసే మార్గాంతరం కనపడడంలేదు. కాఁబట్టి యిప్పట్లో నేను కొంత వ్యతిరేకంగా వున్నప్పటికీ యీ నిక్కపు భక్తుణ్ణి మన్నించి యీ నా సలహాను అంగీకరించండి. మీకు యేస్వల్పంగానో శిష్యులున్నా జట్టీలు తెచ్చే శిష్యులేగాని నావంటి భక్తికల శిష్యులు లేరు. ఇది నిక్కము. నా శిష్యత్వంవల్ల తమకు వచ్చే గౌరవంలేదని శృంఖలంలో వ్రాసివున్నారు. అది చూచి నేను పరమాశ్చర్యపడ్డాను. మనస్సా మీరు అమాయికులని యెఱుఁగుదును. యెఱిఁగి యేమి చెయ్యను? నన్ను మీ వ్రాఁత కృతఘ్నుణ్ణిచేస్తూ వుంది. యే పాపాన్నేనా నేను భరిస్తాను కాని యీ పాపాన్ని భరించలేను. యీ సంగతి నా గీరతంవల్లనే దేవరకు