పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/661

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కవిత్వమూ-బ్రాహ్మణత్వమూ

765


తెలియనివాళ్లు “దేశికులు యెంత దుర్మార్గుఁడు, దేవుణ్ణి 'దుర్మతీ' అని సంబోధించాఁడే యిఁక యితనికి యెవరడ్డుతారు? తల్లిచెవులు దెంపినవానికి పినతల్లిచెవులు బీఱపువ్వులూ గావుగదా" అంటూ దూషిస్తారు. వారివెనక తత్వం తెలియని అమాయికులు “కాఁబోలును. అది కర్ణకఠోరంగానేవుంది. నాకైతే దేశికులవారంటే భక్షేగాని యీ విషయంలో నా మనస్సున్నూ నొచ్చింది. అయితేమాత్రం యేంచేసేది? ఆయన యెదట కిక్కురుమనలేం" అంటూ ఆరంభిస్తారు. అంతేనే కాని దేవుణ్ణికూడా అంతమాట యెందుకనవలసివచ్చిందో అనే విచారణ దాఁకా యెవరికోగాని బుద్ధి ప్రసరింపదు. దేవుఁడున్నాఁడా, లేడా అనే ప్రసక్తి తటస్థించినప్పుడు స్వామివారేదో దేశికులవారికి సహాయం చేయవలసివచ్చిందనిన్నీ ఆ సహాయం గుడితలుపులు కుంచెకోలతో అవసరం లేకుండానే వాటంతట అవి విడిపోవడమే స్వరూపం కలదనిన్నీ చెప్పుకుంటారు. దేశికులవారు కోరిన పని స్వామివారు చేయకపోయేటప్పటికి దేశికులకు పట్టరాని ఆగ్రహం వచ్చింది. యెందుచేత? త్రికరణశుద్ధిగా భగవంతుఁడున్నాఁడు' అనే నమ్మికతో వున్నవాఁడై యితరులను నమ్మిస్తూన్నారు కదా దేశికులు. అట్టి పరమభక్తునిపట్ల తన సత్త చూపకపోతే భక్తుని పాట్లేమికావాలి? “దాసుఁడిపాట్లు పెరుమాళ్లకే యెఱుక” కనక ఆసందర్భంలో దేశికులవారి నోటమ్మట పైవాక్యం వచ్చిందంటే ఆస్తికుఁడెవ్వఁడూ ఔచిత్యానికి భంగంగా తలఁపఁడు. త్యాగరాజు యేమని గానం చేశాఁడు. ఆయన లోకాన్ని మోసం చేసే స్వభావం కలవాఁడేనా? తప్పకుండా భగవంతుఁడున్నాఁడని విశ్వసించినవాఁడు కావుననే “ఎందు దాఁగినాఁడో మారాముఁ డెందుకు దయరాదో?" అని గానం చేశాఁడు.

భగవత్సత్తను గూర్చి నాస్తికులు వితండవాదం చేస్తారు. వారికి భగవంతుఁడు వొక్కసారి కనపడితే లేనిపోనివాదాలతో గ్రంథాలు పెరగవుగాని ఆసృష్టికర్తకు "నీవు లేవు" అనే వాళ్ళందఱికీ కనపడడమేనాపని? (యే యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహమ్). అదిన్నీకాక తనకోసం జపతాపాలు చేసి కృశించేవాళ్లకే దిక్కులేదే? అట్టి దేవుఁడు నాస్తికులకు కనపడి తనసత్తాను ధ్రువపరచుకోవాలా? వున్నాఁడన్న వాళ్లకి వున్నట్లున్నూ లేఁడన్నవాళ్లకు లేనట్టున్నూ వర్తిస్తాఁడు. ఆ మాయామానుష విగ్రహుఁడు; ఆ మాటా త్యాగరాయలే వాక్రుచ్చారు. "కద్దన్నవారికీ కద్దు కద్దని మొఱలిడిన పెద్దలబుద్దులు నేఁ డబద్ధమౌనె." ఇది విషయాంతరం. యిప్పటి నాగరికులు కొందఱు దేశికులవారిని మెచ్చకపోదురుగాక. ఆకాలంలోవారు పూజించారు. విశిష్టాద్వైతులందఱికీ ఆయనమాటంటే వేదం. అద్వైతులేనా "యేదీ నీయెడమకాలు మానెత్తిమీఁదయేలా పెడతావో పెట్టు" అన్నట్లుగా ఐతిహ్యం కనపడదు. ఆయనప్రతిజ్ఞాశ్లోకం యతిరాజ సప్తతిలో నలభైయోది. కావలసినవారు చూచుకోండి. ఆయనకట్టి శక్తిసామర్థ్యాలు వుండఁబట్టే ఆశ్లోకం అప్పుడు