పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/290

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

294



వెనకటి పండితులు

వీరు చాలా అసిధారావ్రతంగా జీవయాత్ర గడుపుకున్నారని గురువులవారు చెపుతూవుంటే వినడమేకాదు కొందఱిని నాబాల్యంలో ప్రత్యక్షంగా చూచికూడా వున్నాను. ముఖ్యంగా వీరి జీవయాత్రకు కావలసింది నీటి సదుపాయం. అదేనా వ్యవసాయానికి వుపకరించేది కాదు, స్నానపానాలకు మాత్రమే. యిచ్చేదాతలు బహుమందివున్నా ప్రతిగ్రహణమంటే వీరికి చచ్చిన చావుగా వుండేది.

“పయః ప్రసృతిపూరకం కిమున ధారకం సారసమ్”

అన్నమాదిరిగా కాలాన్ని వెళ్లిద్దామనేకాని స్విష్టకృత్తుగా ఉదరాన్ని పూరించుకుందా మనేవాంఛ వీరిలో యేకొందఱికో తప్ప వుండేదేకాదు. కాలేకడుపుకు మండే బూడిద సామెతగా కాలం గడిపేవారు. యెంతసేపూ శిష్యులూ, వాళ్ల పాఠాలూ యేలోపమూ లేకుండా జరగడమే వీరికి కావలసింది. వీరి జీవయాత్రను యీపద్యం చెబుతుంది.

మ. చదువుల్ విస్తరికుట్లు జందెపుఁబనుల్ చాపల్ మఱిన్ దొడ్లలోఁ
     బొదలుం గూరలుగాఁగ వర్తిలిరి తద్భూమీసురుల్ నేఁటిసం
     పద “మోటారులు” మేడ లోడలునుగా మాఱెంగదా? వీరి కు
     న్నదె యవ్వారల తృప్తి వారిసుఖమానందంబుఁ గామేశ్వరీ.

ఆయీ మాదిరిని కాలక్షేపం చేసేవారిని ప్రత్యక్షంగా నేను చూచి వున్నాను. రఘువంశం చదువుకొనేరోజుల్లో వొకరిదగ్గర పరాయత్పన్నాలు చెప్పుకోవడానికి శుశ్రూషకూడా చేసివున్నాను. ఆ వొజ్జగారి జీవయాత్రా విధానాన్నే పైపద్యంలో నేను వుటంకించాను. అటుతరువాత శుశ్రూషచేసిన గురువులు కూడా పైపద్యానికి వుదాహరణంగా వుండేవారే గాని మఱోమాదిరివారు కారు. రఘువంశపు గురువుగారు (కానుకుర్తి భుజంగరావు పంతులుగారు) మాత్రం ఆగర్భశ్రీమంతులు కావడంచేత దేవతార్చన స్వయంగా చేయడం యెపుడోగాని తటస్థించేదికాదు. దానికోసం వొక బ్రాహ్మణుఁడు నియమితుఁడు వుండేవాcడు. ఆ పండితులకి మనకి సంసారం యేలా గడుస్తుందనే ఆందోళన వున్నట్టు కనపడేదికాదు. మా పరమగురువు చర్ల బ్రహ్మయ్యశాస్త్రుల్లు