పుట:Chandrika-Parinayamu.pdf/239

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చ. అవనితలేంద్రు లెల్లఁ బ్రమదాతిశయంబునఁ దత్స్వయంవరో
త్సవదినవేళ దివ్యమణిజాతవినిర్మితమంచమండలిన్
బ్రవిమలచిత్తపద్ము లయిబాగుగఁ జేరి వసించి రంగనా
నివహము చామరల్ వలయనిక్వణనంబులు మించ వీవఁగన్. 24

మ. అలవేళన్ హరిపుత్త్రహారకమహుండై నిస్తులాహీనహా
రలతాశోభితమూర్తియై తగుసుచంద్రక్ష్మాతలేంద్రుండు ని
ర్మలపాండుద్యుతిమన్మణీమయమహామంచాగ్రభద్రాసన
స్థలిఁ దాఁ జేరి వసించె రూప్యగిరిఁ గాత్యాయన్యధీశుం డనన్. 25

మ. ఘనముక్తామణికాసనంబున సిరిం గన్పట్టు నాదైత్యభే
దనుఁ డౌరౌర నుతింప నయ్యె ఖరరు క్తైక్ష్ణ్యంబుచేత న్విక
ర్తనబింబమ్మున నుండుట న్సడలి శీతచ్ఛాయబింబంబు చే
రిన వారాశిసుతామనోహరునిదారిం బూని యప్పట్టునన్. 26

సీ. సురగణ్యలావణ్యగరిమ రాజులకుఁ బాం
చాలినిరాశ హెచ్చంగఁ జేయ,
మణిమంచబింబితాత్మచ్ఛాయ తనుఁ గొల్వఁ
దఱియుమన్మథుబుద్ధిదనరఁ జేయ,
హీరభూషణవిభావారంబు వెన్నెల
వలగొన్న రేఱేనిఁ దలఁపఁ జేయ,
వందికంఠధ్వనుల్వైభవశ్రీ నభ్ర
మెనసి చూచుసురాళి కెఱుక చేయ,

తే. కంకణక్రేంకృతు ల్పర్వఁ బంకజాస్య
లలరువింజామరలు వీవ యక్షనేత
పార్శ్వమునఁ గొల్వ బుధపాళిప్రస్తుతింప
మంచతటి నాసుచంద్రుండు మించె నపుడు. 27