పుట:Chandrika-Parinayamu.pdf/238

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చ. శరజహితాన్వయేంద్రుఁడు సు చంద్రధరాధిపచంద్రుఁ డప్డు త
త్తరుణిస్వయంవరోత్సవవిధానము దా విని త న్వరించుఁ బో
హరిమణివేణి యంచు ముదమాంతరవీథికఁ గందళింపఁ గి
న్నరవిభుఁ డాత్మసఖ్యకలన న్వెను పాయక కొల్వ వే తగన్. 18

మ. ద్విరదాధీశ్వరు నెక్కి పౌరవసుగాత్రీరత్నవారంబు క్రొ
వ్విరిసేసన్ బయి నింప విప్రతతి దీవింప న్నవానేకపాం
డురపట్టాతపవారణావృతముఖుండున్ జారుభూషావిభా
స్వరగాత్రుండును నై పురి న్వెడలి ఠేవ న్వచ్చె నప్పట్టునన్. 19

చ. అసురవిదారి కాంచనశతాంగరథాంగపరిభ్రమిప్రకా
రసముదితారవంబు లిభరాట్పటలీఘనబృంహితంబు లు
ల్లసితమహాచమూకలకలంబు జగత్త్రితయంబు గప్ప సం
తసమున సర్వదేశజననాథులు గన్గొన వచ్చె నత్తఱిన్. 20

చ. ఘనకమలేశ్వరాత్మజవికస్వరదీప్తివిలాసహారిపా
వనరుచిజాలలబ్ధి దయివాఱుచుఁ దోఁచినయట్టిలోకబం
ధు నతని విస్మయంబునఁ గనుంగొని రయ్యెడ నప్డు చక్కఁ బ
ద్మిని తదధీనగాఁ దమమతిం దలఁ పుంచిరి రాజు లందఱున్. 21

మ. అతులంబై యనవద్యమై కువలయోదారప్రమోదప్రదా
త్మత సంధించి కరంబు రాజిలు సుచంద్రప్రాజ్యతేజోవ్రజం
బతివేలం బగుచున్ వెలుంగఁగ ననంతాస్థాని నాక్షత్రసం
తతి చూపట్టె సముజ్ఝితస్వకమహాధామాళిచే నయ్యెడన్. 22

తే. ఇట్టు లపు డేగుదెంచినయట్టి సకల
మనుజకాంతులఁ బాంచాలజనవిభుండు
రహి నెదుర్కొని యభినవ్యరత్నమయమ
హోన్నతనివేశపాళులనునిచె నంత. 23