పుట:Chandrika-Parinayamu.pdf/240

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క. నరనాయకకులమంచాం
తరముల వలిగాడ్పు మసలెఁ దపనతనయమం
దిరకేళీవనపాళీ
సురసాళీవాసనాభిశోభితగతియై. 28

వ. అంత ననంత కాంచన మంచాగ్ర సమంచిత సింహాసన సమాసీన మానవనాయక సేవా సమాగమి తత్త త్సేనాధిప సంఘ పరస్పర సంఘర్షణ సముత్తిష్ఠ చ్చిరత్న రత్నాంగద పరాగపూగ తామ్రపట్ట పటాస్తరణ విభ్రాజితంబును, నంతరీపకాంత శిరోవిభాసి తానంతచరనాథమణిమయ మకుటతట నరీనృత్యమాన వినీలకాంతి ప్రరోహ కుహనా ధూపధూమ పూరితంబును, శంబరాక్షీ కదంబక కరాంబుజ సముద్గచ్ఛదరు ణాంశుక శుభాడంబర కంకేళి కుసుమగుళుచ్ఛ రింఛోళికా వితాన విభూషితంబును నై యొప్పుమీఱు గగనా స్థానంబునఁ బాకారి పావక పద్మాప్తసుత పలాశ పయోధీశ పవమాన పౌలస్త్య పార్వతీపతి పరివృ తుండై తదుత్సవంబు వీక్షింప నిండుపేరోలగం బుండె. గాలవ శాండిల్య కౌశిక వసిష్ఠ ప్రముఖ మహర్షులు హర్షో త్కర్షంబునఁ జూడం దొడంగిరి. గరుడ కిన్నర గంధర్వ సిద్ధ సాధ్యముఖ్యు లంతంతం గాంచి సంతసిల్లిరి. అపుడు రాజసభాస్థలం బపరిమిత వేత్రధర సాహోనినాదవాచాలంబై, అభినవభూషణమరీచికావిహార వాటంబై, యతులితంబై యతిశయిల్లం గనుంగొని యాక్షణదోదయ క్షమాధ్యక్షుండు నెమ్మనంబున నీ స్వయంవరంబునకు వచ్చిన ధరాధిపతుల యన్వయగుణాదికంబులు పేర్కొని కుమారి కెఱింగింప నెవ్వరు చాలుదు రఖిలజగజ్జనని గిరిరాజతనుజ గాక యని తలంచి యప్పుడు. 29

మ. పరిపూతాత్మసమన్వితుం డగుచుఁ దత్పాంచాలధాత్రీతలే
శ్వరచంద్రుండు కరాబ్జము ల్మొగిచి శశ్వద్భక్తివైపుల్య మాం
తరవీథిం దళుకొత్త నిల్చి వినయాత్మ న్సన్నుతించె న్మహీ
ధరసమ్రాట్సుత నిర్మలామృతధునీధారాళధారోక్తులన్. 30