పుట:Chandamama 1947 07.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిగురుటాకు తన విచారాన్ని రెమ్మకు చెప్పింది. రెమ్మ మండకు చెప్పింది. మండ కొమ్మకు చెప్పింది. కొమ్మ బోదెకు చెప్పించి. బోదె తల్లిచెట్టుకు చెప్పింది.

తల్లిచెట్టు బోదెతో చిగురుటాకుకు ఈ విధంగా కబురు చేసింది :

" చిగురుటాకును విచారించవద్దను. నన్నే అంటిపెట్టుకుని ఉండమను. నేనిచ్చే ఆహారం ఆరగించమను. ఎండలో చలి కాచుకోమను. గాలిలో ఆడుకోమను. పండుటాకుల పాటపాడే సమయం దానంతట అదే వస్తుంది. అప్పటిదాకా ఆగమను. "

ఈమాట బోదె కొమ్మకు చెప్పింది. కొమ్మ మండకు చెప్పింది. మండ రెమ్మకు చెప్పింది. రెమ్మ చిగురుటాకుకు చెప్పింది.

" అమ్మ చెప్పినట్టే చేస్తానులే, " అన్నది చిగురుటాకు.

అది తల్లినే అంటిపెట్టుకున్నది. ఎంతో ఆహారం తీసుకున్నది. ఎండలో చలి కాచుకున్నది. గాలిలో ఆడుకున్నది. పెరిగి పెద్దదై ముదురు ఆకుపచ్చ రంగుకు తిరిగింది. క్రమంగా దానిరంగు తేలిక ఆకుపచ్చగా మారింది. తరువాత పసుపు పచ్చగా అయింది.

మళ్లీ పండుటాకులపాట వినిపించింది. పండిన ఈ ఆకు కూడా ఆపాట విన్నది. మిగిలిన పండుటాకులతోపాటు పాడ నారంభించింది. పాట తెచ్చిన గాలి మెల్లిగా పండుటాకును చెట్టునుంచి వేరుచేసింది.

పండుటాకు మెల్లిగా గాలిలో తేలుతూ క్రింద పడిపోయింది.

కింద అనేకమైన ఎండుటాకు లున్నాయి. వాటిమధ్య పడి పండుటాకుకూడా వాటిలాగే దీర్ఘనిద్ర పోయింది.